యోగీ సర్కార్ పై సుప్రీం అసంతృప్తిృ-లఖీంపూర్ కేసులో ఆశిష్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్న
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో రైతులపై కారు పోనిచ్చి 8 మంది మృతికి కారకులైన వారిపై దర్యాప్తు విషయంలో బీజేపీ సర్కార్ వైఖరిని సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రంగా తప్పుబట్టింది. దర్యాప్తు జరుగుతున్న తీరుపై సుప్రీం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతులపై కారు పోనిచ్చిన వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాను ఇంకా అరెస్టు చేయకపోవడాన్నీ సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
రైతుల్ని కారుతో గుద్ది చంపిన ఆశిష్ మిశ్రా పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినప్పటికీ ఆయన్ను ఇప్పటివరకూ అరెస్టు చేయకపోవడంపై సుప్రీంకోర్టు యోగీ సర్కార్ కు అక్షింతలు వేసింది. దేశంలోని ఇతర హత్య కేసుల్లోనూ ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నించింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన యూపీ సర్కార్ తరఫు న్యాయవాదులు ఆశిష్ మిశ్రా కోర్టు ముందు హాజరయ్యేందుకు శనివారం ఉదయం 11 గంటలవరకూ గడువు కోరారని వెల్లడించారు. గడువు ముగిసేలోపు అతను పోలీసుల ముందు హాజరుకాకపోతే అరెస్టు వారెంట్ పంపుతామని సుప్రీంకోర్టుకు తెలిపారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు దర్యాప్తు జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ వ్యవహారం సున్నితమైన సమస్య కావడంతో ఇంతకు మించి వ్యాఖ్యలు చేయడం లేదని ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అయితే ఈ కేసులో ఉన్న వ్యక్తుల నేపథ్యాన్ని బట్టి సీబీఐకి దర్యాప్తు అప్పగించడం సరికాదని మాత్రం వెల్లడించారు. కానీ యూపీ సర్కార్ పై మాత్రం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
లఖీంపూర్ ఖేరీ ఘటనలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని కొనసాగించే ప్రశ్నే లేదని, అయితే సదరు అధికారులు ఘటనా స్ధలంలో ఆధారాల్ని మాయం చేయకుండా చూడాల్సిన అవసరం కూడా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని యూపీ డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రత్యామ్నాయ దర్యాప్తు చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు యూపీ సర్కార్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు.