మోదీ రాజీనామా అజెండా: చట్టం దృష్టిలో నేరమా?- బీజేపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన సుప్రీం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్ హత్రాస్ గ్యాంగ్రేప్ కేసు కవరేజీకి వెళ్లిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖ్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యంత కఠినమైన అసాంఘిక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద ఆయనపై కేసు పెట్టడాన్ని తప్పుపట్టింది. ఉత్తర ప్రదేశ్ పోలీసుల తీరుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. బాధిత కుటుంబం గళాన్ని వినిపించడానికి జర్నలిస్ట్ చేసిన ప్రయత్నించడంలో తప్పు లేదని పేర్కొంది.

యూఏపీఏ కింద..
కేరళ న్యూస్ పోర్టల్ అళిముఖమ్ జర్నలిస్ట్ సిద్దిఖ్ కప్పన్. ఢిల్లీ కేంద్రంగా ఆయన పని చేస్తుండేవారు. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కార్యదర్శి కూడా. హత్రాస్లో 19 సంవత్సరాల బాలిక గ్యాంగ్ రేప్కు గురైన కేసులో ఆయన బాధిత కుటుంబ సభ్యుల అభిప్రాయాలను సేకరించడానికి ప్రయత్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా బాధిత కుటుంబాన్ని కలవడానికి సిద్ధిఖ్ ప్రయత్నించరనే కారణంతో యూఏపీఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధిఖ్తో పాటు మరో ముగ్గురు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.

బెయిల్ కోసం..
ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. యూపీ పోలీసుల తరఫున సీనియర్ అడ్వొకేట్ మహేష్ జెఠ్మలానీ తన వాదనలను వినిపించారు. సిద్ధిఖ్ తరఫున కపిల్ సిబల్, హరీష్ బీరన్ వాదించారు. పలు దఫాలుగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్- ఇవ్వాళ ఆదేశాలను జారీ చేసింది. సిద్ధిఖ్కు బెయిల్ మంజూరు చేసింది.

భావ ప్రకటన స్వేచ్ఛగా..
భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరి హక్కుగా సీజేఐ యూయూ లలిత్ బెంచ్ వ్యాఖ్యానించింది. హత్రాస్ గ్యాంగ్రేప్కు గురైన బాలిక కుటుంబం ఆవేదనను సిద్దిఖ్ తెలియజేసే ప్రయత్నం చేశారని పేర్కొంది. అలా చేయడం చట్టం దృష్టిలో నేరమా? అంటూ ప్రశ్నించింది. దీనికి మహేష్ జెఠ్మలానీ బదులిస్తూ- అల్లర్లను సృష్టించాలనే ఉద్దేశంతోనే నిందితుడు హత్రాస్ వెళ్లాడని, అంతకుముందు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతోనూ సమావేశం అయ్యాడని చెప్పారు.

మోదీ రాజీనామా అజెండాతో..
అల్లర్లను సృష్టించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాజీనామా చేయించాలనే ఏకైక అజెండాతో సిద్ధిఖ్ కప్పన్ పని చేశారని అన్నారు. జస్టిస్ రవీంద్ర భట్.. ఆయనతో ఏకీభవించలేదు. 2011లో ఢిల్లీలో నిర్భయ అత్యాచారం కేసులో కూడా వేలాదిమంది స్పందించారని, వారందరూ ఆందోళనలను చేపట్టారని గుర్తు చేశారు. కొన్నిసార్లు ఆందోళనలే చట్టాల్లో మార్పులను తీసుకొస్తాయని, హత్రాస్ ఉదంతం కూడా అలాంటిదేనని చెప్పారు.

ఆరు వారాల పాటు ఢిల్లీలోనే..
అల్లర్లను సృష్టించడానికి సిద్ధిఖ్ ప్రయత్నించాడనికి ఏవైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనికి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారు మహేష్ జెఠ్మలాని. దీనితో సిద్ధిఖ్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సీజేఐ యూయూ లలిత్ స్పష్టం చేశారు. ఆరు వారాల పాటు తప్పనిసరిగా ఢిల్లీలోనే ఉండాలని, జంగ్పురా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆరు వారాల గడువు ముగిసిన తరువాత సొంత రాష్ట్రానికి వెల్లొచ్చని అన్నారు.












Click it and Unblock the Notifications