వరవర రావు బెయిల్పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం: ఇదే తొలిసారి
న్యూఢిల్లీ: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావుకు రిలీఫ్ దక్కింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. వరవర రావు వయస్సు, ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది రెగ్యులర్ బెయిల్ కావడం.. ఆయనకు అతిపెద్ద ఊరట ఇచ్చినట్టయింది. దీనితో త్వరలోనే హైదరాబాద్కు వచ్చే అవకాశాలు లేకపోలేదు.
రెగ్యులర్ బెయిల్..
తనకు రెగ్యులర్ బెయిల్ లేదా పర్మనెంట్ మెడికల్ బెయిల్ను మంజూరు చేయాలంటూ వరవర రావు ఇదివరకు దాఖలు చేసుకున్న పిటీషన్ను బోంబే హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఏప్రిల్ 13వ తేదీన అప్పీల్కు వెళ్లారు. దీనిపై ఒకట్రెండు వాయిదాల తరువాత సుప్రీంకోర్టు ఇవ్వాళ తుది నిర్ణయం తీసుకుంది. పిటీషన్లో పొందుపరిచిన అంశాలు, ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకుంది. రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది.
భీమా కోరేగావ్ కేసులో..
భీమా కోరేగావ్ కేసులో వరవర రావు విచారణ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో ముంబైలోని తలోజా జైలులో గడిపారు. వయస్సు, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలంటూ మావన హక్కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు బోంబే హైకోర్టులో పలు పిటీషన్లు వేశారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గత ఏడాది జులైలో ఆయనకు ఆరు నెలల తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసింది. భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన వారికి బెయిల్ లభించడం కూడా అదే తొలిసారి.
విచారణ ఖైదీగా..
మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారని, ఎల్గార్ పరిషత్, భీమా కోరేగావ్ కేసులో అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్లో వరవర రావును జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. 83 సంవత్సరాల వయోధిక వృద్ధుడైన వరవర రావు ఇదివరకు విచారణ ఖైదీగా ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఆయనకు కరోనా వైరస్ కూడా సోకింది. నానావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు.
పర్మినెంట్ మెడికల్ బెయిల్ కోసం..
బెయిల్ గడువు ముగిసిన అనంతరం ఆయన తలోజా జైలు అధికారులకు సరెండర్ కావాలంటూ బోంబే హైకోర్టు అప్పట్లో వరవర రావుకు సూచించింది. తాత్కాలిక బెయిల్ గడువు ముగియబోతోండటంతో వరవర రావు బోంబే హైకోర్టులో మరోసారి పిటీషన్ వేశారు. పర్మినెంట్ మెడికల్ బెయిల్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ఇంటికి వెళ్లడానికి అనుమతి కావాలని కోరారు. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని, దీనికోసం తాత్కాలిక బెయిల్ పిటీషన్ను మూడు నెలల పాటు పొడిగించాలని విన్నవించారు.
తిరస్కరించిన బోంబే హైకోర్టు..
దీన్ని బోంబే హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ గడువును పొడిగించలేమంటూ స్పష్టం చేసింది. దీనితో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్పై ఇప్పటికే రెండు మూడు వాయిదాల్లో విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఇవ్వాళ తుది ఆదేశాలను జారీ చేసింది. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ సుధాంశు ధులియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు..
వరవర రావు తరఫున సీనియర్ అడ్వొకేట్ ఆనంద్ గ్రోవర్, ఎన్ఐఏ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలను వినిపించారు. భీమా కోరేగావ్ కేసులోనే అరెస్టయిన గిరిజన హక్కుల పోరాట కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి గత ఏడాది జులైలో పోలీసుల కస్టడీలో మరణించారని ఆనంద్ గ్రోవర్ గుర్తు చేశారు. వాదోపవాదాలన్నింటినీ విన్న తరువాత యూయూ లలిత్తో కూడిన ధర్మాసనం వరవర రావుకు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. సరెండర్ కావాలంటూ బోంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది.