మహిళలంటే సుప్రీంకోర్టుకు అపారమైన గౌరవం: వివాదాస్పదమైన రేప్ కేసుపై సీజేఐ బోబ్డే క్లారిటీ
న్యూఢిల్లీ: అత్యాచారానికి గురైన బాలికను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అని సుప్రీంకోర్టు ఇటీవల ఓ కేసులో వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ఆ వివాదంపై స్పష్టతనిచ్చారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, మహిళలంటే తమకు అపారమైన గౌరవం ఉందని బోబ్డే వెల్లడించారు. 'బాధితురాలిని పెళ్లి చేసుకోమని మేం అతడిని అడగలేదు. పెళ్లి చేసుకోబోతున్నావా? అని ప్రశ్నించాం. అంతేగానీ, అతడికి ఎలాంటి ఆదేశాలివ్వలేదు' అని సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది.

ఇటీవల ఓ అత్యాచార కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఆ కేసుకు సంబంధించిన మహారాష్ట్ర విద్యుత్ సంస్థలో టెక్నీషియన్గా పనిచేస్తున్న మోహిత్ సుభాష్ చవాన్(23)పై అత్యచారం కేసు నమోదైంది. 2014-15 ప్రాంతంలో తన దగ్గర బంధువైన బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందింది.
కాగా, ఘటన జరిగేనాటికి బాధిత బాలిక వయసు 16ఏళ్లు కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా, బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సీజేఐ బాబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
'మీరు ఆమెను పెళ్లాడుతారా? అలాగని పెళ్లి చేసుకోవాలని మేమేమీ ఒత్తిడి తేవడం లేదు' అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, ఆయనకు ఇప్పటికే వేరే మహిళతో వివాహం జరిగిందని నిందితుని తరపు న్యాయవాది తెలిపారు. తొలుత ఆ బాలికనే పెళ్లాడాలని అనుకున్నారని, కానీ, అందుకు ఆమె తిరస్కరించడంతో వేరేవారిని చేసుకున్నారని వివరించారు.












Click it and Unblock the Notifications