ప్రమాణ స్వీకారమా? వేచి చూడటమా?: శశికళ భవితవ్యం తేల్చనున్న సుప్రీం
సెంథిల్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. శశికళ ప్రమాణ స్వీకారం చేయవచ్చా? లేక అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా? అన్న దానిపై కీలక ఆదేశాలు వెలువడే సూచనలు .
చెన్నై: సీఎం కావాలని ఉవ్విళ్లూరుతున్న అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీం పరిధిలో ఉన్న అక్రమాస్తుల కేసు ప్రధాన అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. సుప్రీం నిర్ణయం నేపథ్యంలో..ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా సరే ఆమె ప్రమాణ స్వీకారం పట్ల గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
ఇదే క్రమంలో చెన్నైకి చెందిన ఎన్జీవో సంస్థ సత్తా పంచాయత్ ఇయాక్కం జనరల్ సెక్రటరీ సెంథిల్ కుమార్ శశికళను ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపాలని గతవారం పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం నాడు ఈ పిటిషన్ విచారణకు రానుంది. చీఫ్ జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్, జస్టిస్ ఎన్వీ రమణ, డీవై చంద్రచూద్ లతో కూడిన బెంచ్ పిటిషనర్ తరుపు వాదనలు విననుంది.
కాగా, ఈ పిటిషన్ పై గతవారం అత్యవసర విచారణ కోరగా.. సుప్రీం నిరాకరించింది. శశికళ ప్రమాణ స్వీకారం చేశాక.. అక్రమాస్తుల కేసులో గనుక ఆమెకు ప్రతికూలంగా తీర్పు వస్తే తమిళనాడు అల్లకల్లోలంగా మారుతుందని పిటిషన్ లో సెంథిల్ పేర్కొన్నారు.
సెంథిల్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. శశికళ ప్రమాణ స్వీకారం చేయవచ్చా? లేక అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా? అన్న దానిపై కీలక ఆదేశాలు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.
జయలలిత మరణం, తుఫాన్, జల్లికట్టు, నోట్ల రద్దుతో తమిళ ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ప్రస్తుత పరిణామాలు తమిళనాడుకు మరింత నష్టం చేకూరుస్తాయని పిటిషన్ ద్వారా అభిప్రాయపడ్డారు.