కశ్మీరీ విద్యార్థులపై దాడులు: పిటిషన్ను విచారణ చేయనున్న సుప్రీంకోర్టు
ఇతర రాష్ట్రాల్లో చదువును అభ్యసిస్తున్న కశ్మీరి విద్యార్థులను రక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను శుక్రవారం విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. పుల్వామా ఉగ్రదాడుల తర్వాత కశ్మీరీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు వారిపై దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వేస్ పిటిషన్ను త్వరతగతిన విచారణ చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు.
ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణ చేయనుంది. బెంచ్లో సభ్యులుగా జస్టిస్ లావు నాగేశ్వరరావు, సంజీవ్ ఖన్నాలు కూడా ఉన్నారు. కశ్మీర్ విద్యార్థులపై దాడులు హేయమైన చర్యగా భావించిన న్యాయస్థానం ఈ పిటిషన్ను యుద్ధప్రాతిపదికన విచారణ చేస్తామని వెల్లడించింది. గురువారమే ఈ పిటిషన్ను విచారణ చేయాల్సి ఉండగా కొన్ని కారణాలతో అది శుక్రవారానికి వాయిదా పడింది.
దేశవ్యాప్తంగా కశ్మీరీ విద్యార్థులపై దాడులు చేస్తున్నారని వారికి రక్షణ కల్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది అయిన తారిక్ అదీబ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుల్వామా ఉగ్ర దాడుల తర్వాతే కశ్మీరీ విద్యార్థులపై దాడులు ఎక్కువైయ్యాయని తారిఖ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కశ్మీరి విద్యార్థులకు ఆయా విద్యాసంస్థలు భద్రత కల్పించాలని కోరారు. వారికి ప్రాణహాని ఉందని భద్రతతో పాటు మైనార్టీల హక్కులకు భంగం వాటిల్లకుండా అధికారులు భరోసా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్లో తారిఖ్ కోరారు. కశ్మీరీ విద్యార్థులపై దాడులు, అవమానాలు, చిత్రహింసలు, ఇతరత్రా దాడులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ మరో అడ్వకేట్ సత్యమిత్ర ఇంకో పిటిషన్ దాఖలు చేశారు.
ఇక ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేయాలని పేర్కొన్న సత్య మిత్ర... ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో ఓ నోడల్ అధికారిని నియమించాలని కోరారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఓ హెల్ప్లైన్ నెంబరును ఉంచాలని కూడా తన పిటిషన్లో సత్యమిత్ర పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడుల అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలపై , కశ్మీరీలపై దాడులు జరుగుతున్నాయని, ద్వేషపూరిత ప్రసంగాలు కొందరు చేసి రెచ్చగొడుతున్నారని సత్యమిత్ర తన పిటిషన్లో తెలిపారు. ఇవ్వనీ కొన్ని సంస్థలు మాత్రమే పక్కా ప్రణాళికతో చేస్తున్నాయని సత్యమిత్ర ఆరోపించారు.