రేపట్నుంచే: సుప్రీంకోర్టు జడ్జీలు, మాజీ జడ్జీలు, కుటుంబసభ్యులకు కరోనా వ్యాక్సిన్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మార్చి 1 నుంచి రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా చెన్నైలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
కాగా, కరోనా వ్యాక్సిన్ను మంగళవారం(మార్చి 2) నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు తీసుకోనున్నారు. సుప్రీంకోర్టులో ఆవరణలో లేదా వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటైన ఆస్పత్రిలో సుప్రీంకోర్టు జడ్జీలు, మాజీ న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు.
ఇది ఇలావుండగా, దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఒక్కరోజే 15,510 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 87.25 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో 8293, కేరళలో 3254, పంజాబ్ లో 579, కర్ణాటకలో 521, తమిళనాడులో 479, గుజరాత్లో 407 కొత్త కరోనా కేసులు పెరగాయి. గత 24 గంటల్లో 106 మరణాలు నమోదైనప్పటికీ వాటిలో 87 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కొత్త మరణాల్లో మహారాష్ట్రలో 62, కేరళలో 15, పంజాబ్ 7, కర్ణాటక 5, తమిళనాడు 3 చొప్పున నమోదయ్యాయి.
దేశంలో ప్రస్తుతం 1,68,627(1.52శాతం) యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో ఐదు రాష్ట్రాల్లోనే 84 శాతం యాక్టివ్ ఉన్నాయి. మహారాష్ట్రలో 46.39శాతం, కేరళలో 29.49 శాతం, కర్ణాటకలో 3.45 శాతం, పంజాబ్లో 2.75శాతం, తమిళనాడులో 2.39శాతం చొప్పున ఉంది. కాగా, అత్యధికంగా కేరళ, మహారాష్ట్రలో 10వేలకుపైగా యాక్టివ్ కేసులుండగా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. మార్చి 1 నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది.