క్రిప్టో కరెన్సీకి తలుపులు బార్లా: ఇక వెల్లువలా కనిపించని నగదు: నిషేధాన్ని ఎత్తేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ..డిజిటల్ కరెన్సీ..వర్చువల్ కరెన్సీ..పేరు ఏదైనప్పటికీ.. అది మన కంటికి కనిపించని నగదు. చేత్తో తాకలేం.. పర్సులో పెట్టుకోలేం. సంప్రదాయబద్ధంగా కనిపించే రూపాయలను గానీ, నాణేలను గానీ మనం భౌతికంగా చూడగలం..వాటిని తాకగలం. వాటన్నింటికీ భిన్నమైనది క్రిప్టో కరెన్సీ. కంప్యూటర్ స్క్రీన్పై మాత్రమే కనిపిస్తుంది. ఆ మొత్తాన్ని మనం తీసుకోవాలీ అంటే రూపాయల్లో మార్చుకోవాల్సి ఉంటుంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వెనక్కి: వాయిదా వేసే యోచనలో జగన్ సర్కార
క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ రిజర్వుబ్యాంకు ఉత్తర్వులు..
క్రిప్టో కరెన్సీని రూపాయల్లోకి మార్చుకోవడాన్ని నిషేధించింది రిజర్వుబ్యాంకు. దీనిపై 2018 ఏప్రిల్లో ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలను కొట్టేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం తీర్పును ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిషేధిస్తూ రిజర్వుబ్యాంకు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ భారత ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ప్రతినిధులు సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు.
ఆదేశాలను కొట్టేసిన ధర్మాసనం..
ఈ పిటీషన్పై ఇదివరకే విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తాజాగా- బుధవారం జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ రామసుబ్రమణియన్లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును వెలువడించింది. 2018లో రిజర్వుబ్యాంకు జారీ చేసిన ఆదేశాలు, సర్కులర్ను కొట్టి వేస్తున్నట్లు వెల్లడించింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిషేధించడానికి సహేతుకమైన కారణాలను రిజర్వుబ్యాంకు వెల్లడించలేకపోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
డిజిటల్ కరెన్సీ లావాదేవీల వెల్లువ..
ఫలితంగా- క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలను ఇక మరింత విస్తృతంగా నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. బిట్ కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీని నగదురూపంలో మార్చుకోవడానికి వెసలుబాటు చిక్కినట్టయింది. దీనివల్ల వ్యాపార లావాదేవీలను నిర్వహించే వారు ఆన్లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఆన్లైన్ మోసాలను నిరోధించేలా కఠిన నిబంధనలను గానీ, చర్యలను గానీ చేపట్టాల్సిన బాధ్యత ఇకపై రిజర్వుబ్యాంకుపై ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బిట్ కాయిన్ లావాదేవీలపై కొన్ని నిషేధం..
బిట్ కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ లావాదేవీలను కొన్ని దేశాల్లో నిషేధించారు. బంగ్లాదేశ్ వంటి దేశాల్లో దీన్ని నిషేధించారు. ఆన్లైన్ మోసాలు పెరిగిపోతాయనే కారణాల వల్ల వాటిపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా-భారత్లో ఇప్పటిదాకా ఉన్న నిషేధాన్ని ఎత్తేయడం వల్ల మార్కెట్ వర్గాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. డిజిటల్ లావాదేవీలు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో బిట్ కాయిన్ తరహా వ్యవస్థ ఎలాంటి పరిణామాలకు కారణమౌతుందనేది చర్చనీయాంశమౌతోంది.