సంపూర్ణ స్వాతంత్య్రం కావాలంటే పెళ్లి చేసుకోవద్దు : సుప్రీం కోర్టు
ఓ విడాకుల కేసు విచారణలో భాగంగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన "సుప్రీం కోర్టు" సంచలన వ్యాఖ్యలు చేసింది. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలంటే పెళ్లే చేసుకోవద్దు అని చెప్పింది. వివాహం చేసుకున్న తర్వాత ఒక భాగస్వామి మరొకరిపై ఆధారపడకుండా ఉండటం అసాధ్యమని వెల్లడించింది. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వివాహంలో ఆధారపడటం తప్పనిసరి - జస్టిస్ నాగరత్న
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ .. భార్య తన భర్తపై ఆధారపడను అనడం అసాధ్యం. ఆర్థికంగా కాకపోయినా భావోద్వేగపరంగా, మానసికంగా అయినా భాగస్వాములు ఒకరిపై ఒకరు ఆధారపడటం వివాహ బంధం యొక్క సహజ స్వభావం" అని పేర్కొన్నారు.

ఈ కేసులో ఇద్దరు పిల్లలున్న జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. భర్త సింగపూర్లో ఉద్యోగం చేస్తుండగా, భార్య హైదరాబాద్ నుంచి విచారణలో వర్చువల్గా పాల్గొన్నారు. తన భర్తతో ఇక కలిసుండలేనని భార్య స్పష్టంగా తెలిపింది. గతంలో సింగపూర్ వెళ్ళినప్పుడు తనను సరిగా చూసుకోలేదని.. డబ్బుల విషయంలో గొడవలు జరిగాయని కోర్టులో వాపోయింది. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు కూడా వివరించింది.
పిల్లల కోసం..
అయితే న్యాయమూర్తులు భావోద్వేగంతో స్పందిస్తూ.. పిల్లల భవిష్యత్తు కోసం దంపతులు విడిపోకుండా ఆలోచించాలి. విచ్ఛిన్నమైన కుటుంబాన్ని పిల్లలు చూడకూడదు అని స్పష్టం చేశారు. పిల్లల కోసం విడాకులు తీసుకోవద్దని, సాధ్యమైనంత వరకు రాజీ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు కోర్టు తాత్కాలిక ఆదేశాల ప్రకారం, పిల్లల భవిష్యత్తు కోసం భర్త రూ. 5 లక్షలు జమ చేయాలని నిర్ణయించింది. అలాగే వారాంతాల్లో పిల్లలను తన వద్దకు తీసుకెళ్లేందుకు భర్తకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. భర్త రాజీకి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేయగా, భార్య మాత్రం ఇంకా విముఖత చూపినట్లు సమాచారం.
ఈ కేసులో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు సంప్రదాయ వైఖరిని మరోసారి బయటపెట్టాయి. వివాహ వ్యవస్థను కాపాడటం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం కుటుంబ సమగ్రతను కాపాడటం అవసరమని న్యాయస్థానం చెబుతోంది.












Click it and Unblock the Notifications