కేంద్ర సంస్థలు కంప్యూటర్లను పర్యవేక్షించడం కరెక్టేనా...కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఎవరి కంప్యూటర్నైనా లేదా సోషల్ మీడియానైనా పర్యవేక్షించి సమాచారం తీసుకోవచ్చని ఆ బాధ్యతను పలు కేంద్ర సంస్థలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై సుప్రీంకోర్టు అడ్డు చెప్పింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఒకరి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లపై కానీ పర్యవేక్షించడం సరికాదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతానికి కేంద్రానికి నోటీసులు పంపిన కేంద్రం... కేసు విచారణ మరో ఆరువారాల పాటు వాయిదా వేసింది.
ఏ కంప్యూటర్ అయినా, ఎలక్ట్రానిక్ డివైస్ అయినా పర్యవేక్షించేందుకు పలు సంస్థలకు అప్పజెప్తూ డిసెంబర్ 20న కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై రాజ్యసభ భగ్గుమంది. ఒకరి వ్యక్తిగత విషయాలలోకి తొంగి చూసే అధికారం ఎవరికీ లేదని రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. ఐబీ, సీబీఐ, ఆదాయపన్నుల శాఖతో పాటు ఇతర ఏజెన్సీలకు కూడా బాధ్యతలు అప్పజెప్పడాన్ని తప్పుబడుతూ విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి.
ఇప్పటికే ఐటీ చట్టం కింద ఏజెన్సీలకు అనుమతులు ఉన్నాయి కాబట్టి కొత్తగా బాధ్యతలు అప్పజెప్పడం ఎందుకని విపక్షాలు ప్రశ్నించాయి. ఐటీ చట్టంను కాదని ఏజెన్సీలు సొంతంగా కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలను అమలు చేస్తే వ్యక్తిగత సమాచారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుందని విపక్షాలు పేర్కొన్నాయి. దీనిపై నాడు రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా స్పందించారు. దేశాన్ని పోలీసుల దేశంగా మార్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సమస్యలు వస్తే పోలీసులే పరిష్కారం చూపుతారంటే మీరెంత అభద్రతా భావం ఉన్న నియంతనో దేశ ప్రజలకు మరోసారి రుజువు అయ్యిందని రాహుల్ నాడు ట్విటర్లో పోస్టు చేశారు.