ప్రాధమిక హక్కులు సరే-విధులేవీ-అమలుకు సుప్రీంలో పిటిషన్-రాష్ట్రాలకు నోటీసులు
భారత్ లో గత రెండు, మూడేళ్ల కాలంలో వ్యవసాయ చట్టాలు సహా పలు కీలక అంశాలపై నిరసనలు జరిగాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించడం, ప్రభుత్వ కార్యకలాపాల్ని అడ్డుకోవడం వంటి చర్యలకు దిగడంపై ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రాథమిక విధుల్ని కూడా కచ్చితంగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.సుప్రీంకోర్టు న్యాయవాది దుర్గా దత్తా ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
రాజ్యాంగంలో సమగ్రంగా నిర్వచించిన చట్టాల ద్వారా దేశభక్తి, దేశ ఐక్యతతో సహా పౌరుల ప్రాథమిక విధులను అమలు చేయాలనే పిటిషన్పై స్పందించాలని సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ నోటీసులు జారీ చేసింది. తనను సుప్రీంకోర్టు న్యాయవాదిగా పరిచయం చేసుకున్న దుర్గాదత్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల వలె ప్రాథమిక విధులు కూడా ముఖ్యమైనవని పౌరులకు గుర్తు చేయడం ఇప్పుడు తక్షణావసరం అని పిటిషనర్ వాదించారు.
తమ డిమాండ్లను నెరవేర్చమని ప్రభుత్వాన్ని బలవంతం చేయడానికి రోడ్డు, రైలు మార్గాలను అడ్డుకోవడం, వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో నిరసనకారులు చేస్తున్న కొత్త చట్టవిరుద్ధమైన నిరసనల కారణంగా ప్రాథమిక విధులను అమలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని పిటిషనర్ సుప్రీం దృష్టికి తెచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు ప్రాథమికంగా పౌరులపై "నైతిక బాధ్యతలుగా ఉన్నాయని, కానీ వీటిని తప్పక అమలు చేయించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్రాల వివరణ కోరింది.