ఖాప్ పంచాయతీలను కట్టడి చేయండి: పెళ్లిళ్లపై సుప్రీం
న్యూఢిల్లీ: ఇద్దరు మేజర్లు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే అందులో కల్పించుకునే హక్కు ఎవరకీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరువు హత్యలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆ విషయాన్ని తేల్చి చెప్పారు.
ఇద్దరు వయోజనులు పెళ్లి చేసుకుంటే అందులో కల్పించుకునే హక్కు తల్లిదండ్రులు, సమాజం, ఎవరికైనా సరే ఉండదని సుప్రీంకోర్టు చెప్పింది. వ్యక్తిగతంగా గానీ, సమూహంగా గానీ ఆ పెళ్లి విషయంలో థర్డ్ పార్టీ జోక్యం ఉండరాదని చెప్పింది.
ఖాప్ పంచాయతీల పేరిట చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నవారిపైనా, పరువు హత్యలపైనా నిషేధం విధించాలని కోరుతూ శక్తి వాహిని అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఖాప్ పంచాయతీలపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఖాప్ల నుంచి జంటలను కాపాడాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఖాప్లు ఇద్దరు వయోజనులు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పింది.
మధ్యయుగం నాటి సంప్రదాయాలను కాపాడడం తమ బాధ్యత అన్నట్లుగా ఖాప్ పంచాయతీలు కుటుంబాల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకునే జంటనలు విచారించి శిక్షిస్తున్నాయని ఆ పిటిషన్లో ఫిర్యాదు చేశారు.