Supreme Court: వైద్య విద్యలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు
Supreme Court: వైద్య విద్య సీట్లలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. రాష్ట్రంలో నివసించేవారి విషయంలో రిజర్వేషన్ల గురించి ఆలోచించవచ్చని.. అయితే అది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వరకేనని.. ఆ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే.. ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కీలక తీర్పును జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సుధాంషు ధులియా జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఇచ్చింది. రాష్ట్ర కోటా కింద పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నివాస ఆధారిత రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. మరోవైపు ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు, ఈ కేటగిరి కింద ఇప్పటికే పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై ఈ తీర్పు ప్రభావం ఉండదని వెల్లడించింది.
నీట్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రదీప్ జైన్, సౌరభ్ చంద్ర కేసుల్లో గతంలో ఇచ్చిన తీర్పులను పునరుద్ఘాటిస్తూ.. వైద్య విద్యలో నివాస ఆధారిత కోటాను రద్దు చేస్తూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయంలో తీర్పును వెలువరించింది. "మనమందరం భారతదేశ భూభాగంలోనే ఉంటున్నాం. కాబట్టి ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. భారతదేశంలో ఎక్కడైనా నివసించే, ఏదైనా వ్యాపారం లేదా వృత్తిని కొనసాగించే హక్కు మనకు ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏ విద్యాసంస్థలోనైనా ప్రవేశం పొందే హక్కును రాజ్యాంగం మనకు ఇచ్చింది." అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉండగా.. గతంలో ఈ విషయంపై పంజాబ్-హరియాణా కోర్టు తీర్పు ఇచ్చింది. పీజీ మెడికల్ కోర్సులకు నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. దీనిని పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. ఇద్దరు సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. కేసు ప్రాముఖ్యత నేపథ్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫారసు చేయగా.. తాజాగా తీర్పు వెలువడింది.












Click it and Unblock the Notifications