బెంగాల్ ఎస్ఐఆర్ పై సుప్రీం సంచలన ఆదేశం..! మమత-ఈసీ పోరు వేళ..!
పశ్చిమబెంగాల్ (west bengal) లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ఈసీ వర్సెస్ ప్రభుత్వంగా మారిపోయింది. భారీ ఎత్తున ఓటర్లను తొలగించేందుకు ఈసీ చేస్తున్న ప్రయత్నాలపై మండిపడుతున్న బెంగాల్ ప్రభుత్వం.. వాటిని ఎక్కడిక్కడ అడ్డుకోవడం మొదలుపెట్టింది. దీంతో ఈసీ కూడా కఠినమైన ఆదేశాలు ఇస్తోంది. ఇలాంటి సమయంలో ఎస్ఐఆర్ విషయంలో సుప్రీంకోర్టు (supreme court) ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది.
పశ్చిమబెంగాల్ లో ఓటర్ల జాబితాల సవరణపై దురదృష్టకరమైన విమర్శల ఆట కొనసాగుతోందని ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు బెంగాల్లో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు న్యాయాధికారుల్ని నియమించాలని కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు ఇచ్చింది. వీరు ఎస్ఐఆర్ లో అభ్యంతరాలు, వివాదాలను పరిష్కరిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది.

ఇద్దరు రాజ్యాంగ కార్యనిర్వాహకుల (రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ) మధ్య విశ్వాస లోపాన్ని బయటపెట్టే ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకోవడం దురృష్టకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇప్పుడు వ్యత్యాస జాబితాలో చేర్చిన వ్యక్తుల వాదనలు, అభ్యంతరాల దశలోనే ఈ ప్రక్రియ నిలిచిపోయిందని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఎస్ఐఆర్ కోసం పనిచేస్తున్న, జిల్లా జడ్జి హోదాలో ఉన్న మాజీ న్యాయ అధికారులను కూడా ఈ ప్రక్రియ కోసం నియమించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసాధారణ పరిస్థితుల కారణంగా అసాధారణ ఉత్తర్వు జారీ చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది












Click it and Unblock the Notifications