NEET UG 2021: పరీక్షల ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)- 2021 అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షల ఫలితాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరడానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఆన్ హోల్డ్లో ఉంచాలంటూ బోంబే హైకోర్టు ఇదివరకు జారీ చేసీన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అనుమతి ఇచ్చింది. దీనితో- త్వరలోనే నీట్ యూజీ-2021 ప్రవేశ పరీక్షా ఫలితాలు వెల్లడి కానున్నాయి.
అర్ధరాత్రి ప్రియురాలి రూమ్లో ప్రేమోన్మాది: గొంతుకోసిన డిగ్రీ స్టూడెంట్..: ఆసుపత్రిలో
:
బోంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై అప్పీల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్పై న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించింది. నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ను నిర్వహించిన సందర్భంగా మహారాష్ట్రలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు అభ్యర్థుల ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు మిళితం అయినట్లు తేలింది.
దీనితో ఈ ప్రవేశ పరీక్షా ఫలితాలను వెల్లడించవద్దంటూ కొందరు అభ్యర్థులు బోంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ అనంతరం- ఫలితాలను ఆన్ హోల్డ్లో ఉంచాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రవేశ పరీక్షా ఫలితాల వెల్లడి స్తంభించిపోయింది. దీనిపై మరికొందరు అభ్యర్థులు- సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లారు. వారి పిటీషన్లను విచారణకు స్వీకరించిన జస్టిస్ లావు నాగేశ్వర రావు సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. అనుకూల తీర్పును వెలువడించింది.
బోంబే హైకోర్టును ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అనుమతి ఇచ్చింది. ఎన్టీఏ తరఫున తన వాదనలను వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చిన సబ్మిషన్లను పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని బెంచ్ వివరించింది. ఆ ఇద్దరు విద్యార్థుల విషయంలో ఏం జరిగిందనేది తాము దీపావళి సెలవుల తరువాత విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఆ ఇద్దరి కోసం 16 లక్షల మంది అభ్యర్థుల ప్రవేశ పరీక్ష ఫలితాలను నిలుపుదల చేయలేమని వ్యాఖ్యానించింది.
కిందటి నెల నిర్వహించిన నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 16 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలను రాశారు. 16,14,777 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో ఇద్దరు అభ్యర్తులు వైష్ణవి భోపాలి, అభిషేక్ శివాజీకి సంబంధించిన ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు మిళితం అయ్యాయి. వారు బోంబే హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్షల ఫలితాలను వెల్లడించడానికి బ్రేక్ పడింది.