మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత కామెంట్స్..! విచారణపై తేల్చేసిన సుప్రీం..!
ఇస్లాంను ప్రవచించిన మొహమ్మద్ ప్రవక్త (prophet Muhammad)పై బీజేపీ మైనార్టీ మోర్చా నాయకురాలు నాజియా ఎలాహి ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వీటిపై సుప్రీంకోర్టు (Supreme Court) జోక్యం కోరుతూ దాఖలైన పిటిషన్ ఇవాళ చర్చకు వచ్చింది. ఈ వ్యాఖ్యల్ని నేరుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తన నిర్ణయం ప్రకటించింది. మౌఖిక పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
బీజేపీ మైనారిటీ మోర్చా నాయకురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాజియా ఎలాహి ఖాన్.. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నేరుగా విచారణ చేపట్టాలంటూ దాఖలైన మౌఖిక పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. తద్వారా ప్రామాణిక న్యాయ ప్రక్రియలను దాటవేసేందుకు నిరాకరించింది. మౌఖికంగా ప్రస్తావించిన న్యాయవాదిని ఉద్దేశించి.. జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన వెకేషన్ బెంచ్, ఫిర్యాదులు దాఖలు చేసేందుకు ఉన్న అధికార శ్రేణి వ్యవస్థ పక్కదారి పట్టేలా తాము రిస్క్ చేయబోమని స్పష్టం చేసింది.

పిటిషన్లో లేవనెత్తిన అంశం చాలా తీవ్రమైనది అయినప్పటికీ, ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ తర్వాత సరైన విచారణ జరిపే ప్రక్రియను కచ్చితంగా పాటించాలని జస్టిస్ అమానుల్లా తెలిపారు. పార్టీలు మొదటి అడుగుగా సుప్రీంకోర్టుకు రాకూడదన్నారు. చట్టం నిర్దేశించిన సరైన ప్రక్రియను తప్పించుకునే ధోరణి పెరుగుతోందని బెంచ్ విమర్శించింది. ప్రజా ప్రయోజన పిటిషన్ను మౌఖికంగా ప్రస్తావించిన న్యాయవాది .. ఖాన్ చేసినట్లు ఆరోపించబడిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత సామరస్యాన్ని దెబ్బతీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మీరు ప్రజాప్రయోజనం దాఖలు చేస్తారా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారా? మీకు వ్యవస్థపై ఎందుకు నమ్మకం లేదు?"అని న్యాయవాదిని కోర్టు నిలదీసింది.
ప్రతి వ్యాజ్యదారుడు లేదా ఫిర్యాదుదారుడు పోలీసులను, దిగువ కోర్టులను పక్కనపెట్టి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, మొత్తం వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని ధర్మాసనం పేర్కొంది.












Click it and Unblock the Notifications