కమల్నాథ్ 'స్టార్ క్యాంపెయినర్' వివాదం... సుప్రీం కోర్టులో ఈసీకి చుక్కెదురు..
మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ 'స్టార్ క్యాంపెయినర్' హోదాను ఈసీ రద్దు చేయడంపై సుప్రీం కోర్టు 'స్టే' విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం రాజకీయ పార్టీల్లో నాయకుల హోదాపై ఈసీకి నిర్ణయాధికారం ఎక్కడిదని ప్రశ్నించింది. ఈసీకి ఆ నిర్ణయాధికారం లేనందున... కమల్నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేయడంపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. కమల్నాథ్ పిటిషన్పై ఈసీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కమల్నాథ్ పిటిషన్పై సోమవారం(నవంబర్ 2) విచారణ చేపట్టింది.
ఇప్పటికే ప్రచార పర్వం కూడా ముగియడం.. రేపే (నవంబర్ 3న) ఉపఎన్నికలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడీ విషయం ప్రాధాన్యతను కోల్పోయింది. ఈసీ తరుపున సుప్రీంలో విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఉపఎన్నికల్లో తన స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేయడాన్ని శనివారం(అక్టోబర్ 31) కమల్నాథ్ సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. 'ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఉన్న హక్కు. ఇందులో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకూడదు. ఒకరకంగా ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం లాంటిదే...' అని కమల్నాథ్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
సీనియర్ న్యాయవాది,కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంఖా మాట్లాడుతూ.. ఈసీ నిర్ణయాన్ని అక్రమమని పేర్కొంటూ కమల్నాథ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఒకరకంగా ఇది కమల్నాథ్తో పాటు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ద హక్కులకు విఘాతం కలిగించడమేనని అందులో పేర్కొన్నారు.
ఎన్నికల నియామావళిని ఉల్లంఘించారన్న కారణంతో కమల్నాథ్కు స్టార్ క్యాంపెయినర్ హోదాను ఈసీని రద్దు చేసింది. మధ్యప్రదేశ్ మంత్రి,బీజేపీ నేత ఇమర్తి దేవిని 'ఐటమ్' అని కమల్నాథ్ విమర్శించడం తీవ్ర దుమారం రేకెత్తించింది. దీనిపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో... కమిషన్ కమల్నాథ్ వివరణ కోరింది. అయితే ఆయన వివరణపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఈసీ.. ఆయన స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
కాగా,నవంబర్ 3న మధ్యప్రదేశ్లోని 28 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను మొత్తం 28 మంది స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును కాంగ్రెస్ పార్టీ ఈసీకి సమర్పించింది.