కరోనా ఒమిక్రాన్ విజృంభణ: 3 నుంచి సుప్రీంకోర్టులో విర్చువల్ విధానంలోనే విచారణ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (జనవరి 3) నుంచి వర్చువల్ పద్ధతిలో కేసుల విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. రెండు వారాలపాటు ఈ విధానంలోనే కేసుల విచారణ జరగనుందని వెల్లడించింది.
కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక కరోనా కేసుల పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, దేశంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 27వేలకుపైగా కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. గత కొన్ని వారాలుగా 1వేలులోపే కేసులు నమోదవుతుండగా.. తాజాగా 20వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో రాత్రిపూట కర్ఫ్యూలు, ఆంక్షలు విధిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం 3194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం కూడా 3వేలకు చేరువలో కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యక్ష విచారణను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. గతంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి సమయంలోనూ సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలు జరిపింది.