ప్రేమించలేదనే కసితో పొడిచిపొడిచి చంపేశాడు
కోయంబత్తూరు: పెళ్లిపీటల మీద కుర్చోవలసిన ఓ యువతి ఉన్మాది కిరాతకానికి బలి అయ్యింది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ లో నివాసం ఉంటున్న ధన్య (23) అనే యువతిని జకీర్ (27) అనే యువకుడు దారుణంగా చంపేశాడు.
ధన్య ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ధన్యకు ఇటీవలే నిశ్చితార్థం అయ్యింది. త్వరలో పెళ్లి చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు. బుధవారం ధన్య తల్లిదండ్రులు సోమసుందరం (టైలర్), శారద ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఊరెళ్లారు.
వారు రాత్రి తిరిగి ఇంటికి వచ్చి చూడగా ధన్య రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆర్తనాదాలు చెయ్యడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి అన్నూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తాము ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారానికి తాళం వేసి వెళ్లామని, ఇంటి వెనుక తలుపు నుంచి వచ్చిన దుండగుడు ధన్యను హత్య చేశాడని వారు విలపించారు. శరీరం అంతా కత్తిపోట్లు పడటంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ధన్య సంఘటనా స్థలంలో మరణించింది.
ఓ యువకుడు నిత్యం తమ కుమార్తెను ప్రేమించమని వేధిస్తున్నాడని, ధన్య నిరాకరించడంతో అతనే హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. పోలీసులు జకీర్ కోసం గాలించారు.
అప్పటికే జకీర్ విషం సేవించాడని పోలీసులు గుర్తించారు. విషమస్థిలో ఉన్న అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని పోలీసులు అన్నారు. ధన్య హత్యను ఖండిస్తూ గురువారం అన్నూర్ లో స్వచ్చందంగా బంద్ నిర్వహించారు.