కేంద్ర ఎన్నికల సంఘంలో అనూహ్యం -నూతన సీఈసీగా సుశీల్ చంద్ర -సునీల్ అరోరా ముందస్తు రిటైర్మెంట్
కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ రాజుకున్న వివాదాలు పెద్దవి అవుతోన్న తరుణంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా సునీల్ అరోరా పదవీ కాలం మరో మూడు వారాలు మిగిలుండగానే ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లయింది. ఆయన స్థానంలో సుశీల్చంద్ర నూతన సీఈసీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనూ సీఈసీ సునీల్ అరోరా.. తాను ఏప్రిల్ 30న రిటైర్ అవుతానని, ఐదు రాష్ట్రాల ఫలితాల కంటే ముందే పదవీ విరమణ పొందుతానని చెప్పడం తెలిసిందే. నిజానికి అరోరా రిటైర్మెంట్ కంటే ముందే కొత్త సీఈసీ పేరును ప్రకటించడం, ఆ మేరకు నియామక ఉత్తర్వులు రావడం సహజమే అయినప్పటికీ, సుశీల్ చంద్ర విషయంలో వ్యవహారం మరోలా ఉంది..

సునీల్ అరోరా వారసుడిగా నియమితుడైన సుశీల్ చంద్ర ఈ మంగళవారమే(ఏప్రిల్ 13న) సీఈసీగా బాధ్యతలు చేపడుతున్నారు. మరి ఏప్రిల్ 30 వరకు అరోరా ఏం చేస్తారు? ఏ హోదాలో ఈసీలో కొనసాగుతారు? లేక ముందస్తు రిటైర్మెంట్ గా తప్పుకుంటారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంగళవారం బాధ్యతలు చేపట్టనున్న సుశీల్ చంద్ర.. వచ్చే ఏడాది(2022) మే 14వ తేదీ వరకు పదవిలో కొనసాగనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్ను ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, సిట్టింగ్ సీఈసీ రిటైర్మెంట్ కంటే ముందే కొత్త సీఈసీ పదవీబాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశమైంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఎన్నికల ప్రచారం నుంచి నిషేధిస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చిన నాడే కొత్త సీఈసీ నియామకం జరగడం గమనార్హం.
ఈసీ తీరును ఖండిస్తూ బెంగాల్ సీఎం మమత మంగళవారం ధర్నాకు దిగనుండగా, అదే రోజు సుశీల్ చంద్ర సీఈసీగా బాధ్యతలు చేపడతారు. ఆయన నేతృత్వంలోనే గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం కమిషనర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సుశీల్ చంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications