జైట్లీపై అనుచిత వ్యాఖ్యలు: 'చర్యలు తీసుకోండి'
న్యూఢిల్లీ: డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అవకతవకల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్పై చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ డిమాండ్ చేశారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం కీర్తి ఆజాద్పై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు సుశీల్ కుమార్ మోడీ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. డీడీసీఏ అక్రమాల వ్యవహారంలో గత కొన్ని రోజులుగా అరుణ్ జైట్లీపై కీర్తి ఆజాద్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విషయంపై ఇప్పటివరకూ బీజేపీ నేతలెవరూ నోరు మెదపలేదు. తాజాగా కీర్తి ఆజాద్పై క్రమ శిక్షణా చర్యలు చేపట్టాలని సుశీల్ కుమార్ మోడీ డిమాండ్ చేశారు. డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ సీఎంపై కేజ్రీవాల్ పరువు నష్టం దావా వేశారు.
దీనిపై కీర్తి అజాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే తనపై దావా వేయాలని జైట్లీకి సవాల్ విసిరారు. 'హల్లో డియర్ అరుణ్జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్ నా మీద కూడా వేయ్. మినహాయింపు ఏమీ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్ చేశారు.
'నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. మీరే కదా నేను రిజిస్టర్ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది' అంటూ ట్వీట్ చేశారు. దీంతో కీర్తి ఆజాద్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం కీర్తి అజాద్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.