చిన్నమ్మ గా తెలంగాణలో ముద్ర..! ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సుష్మ కీలక పాత్ర..!!
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్ అకాల మరణంతో తెలంగాణ చిన్నబోయింది. రాజకీయాల్లో చిన్నమ్మ లేని లోటు పూడ్చలేనిదని తెలంగాణ ప్రజానికం చింతిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆమె తనని తెలంగాణ చిన్నమ్మగా పిలవాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీని పెద్దమ్మగా భావించాలన్న సుష్మ...బిల్లుకు మద్దతుగా నిలిచిన తనను చిన్నమ్మగా భావించాలని కోరారు. నాడు పార్లమెంట్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మస్వరాజ్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన బిల్లుకు ఆమె మద్దతు పలికారు. ఈ కారణంగానే తెలంగాణ ప్రజలు ఆమెను ఎప్పటికీ మర్చిపోలేరు.
బీజేపీ కీలక మహిళా నాయకురాలు సుష్మాస్వరాజ్ రేర్ పిక్స్ (ఫోటోలు)
తెలంగాణ కు పూర్తి అనుకూలం..! తెలంగాణ ఆవశ్యకతను వివరించిన చిన్నమ్మ..!!
తెలంగాణతో సుష్మస్వరాజ్ (67) మరుపురాని అనుబంధాన్ని పెంచుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందేనని పార్లమెంటులో బలమైన వాణి వినిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్ష నేతగా సుష్మస్వరాజ్, తెలంగాణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనీ, వారి గొంతు వినాలనీ కోరారు. తెలంగాణ ఉద్యమంపై సుష్మస్వరాజ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎందుకు తెలంగాణ వెనకబడిందో, తరతరాలుగా ప్రజలు ఎన్నెన్ని కష్టాలు ఎదుర్కొన్నారో లెక్కలతో సహా పార్లమెంటులో వివరించారు.
ఉద్యమంలో కీలక పాత్ర..! దైర్యంగా ప్రసంగాలు ఇచ్చిన సుష్మ..!!
2017 నవంబర్లో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో సుష్మాస్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా పాల్గొన్నారు. తనకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలంటే ఎంతో ఇష్టమన్న ఆమె... సంప్రదాయ ఆధునీకరణల పరిపూర్ణ మేళవింపుగా తెలంగాణను అభివర్ణించారు. అంతకు ముందు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న 2009 సంవత్సరంలో ఓయూ విద్యార్థలు నిజాం కాలేజీ మైదానంలో నిర్వహించిన విద్యార్థి గర్జన సభకు సుష్మాస్వరాజ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అప్పుడు బీజేపి ప్రతిపక్ష హోదాలో ఉంది. సభకు హాజరైన సుష్క స్పూర్తిదాయక ప్రసంగంతో యావత్ తెలంగాణ విద్యార్థులను ఆకట్టుకొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వక పోతే బీజేపి అదికారంలోకి వచ్చాక ఇచ్చి తీరుతామని ఘంటాపథంగా చెప్పారు తెలంగాణ చిన్నమ్మ.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి భావోద్వేగం..! కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి..!!
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఎయిమ్స్లో అత్యవసర చికిత్స పొందుతూ మరణిచారు.సుష్మా స్వరాజ్ పార్థివదేహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ మృతిపట్ల తీవ్ర భావోద్వేగానికి గురైన కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సుష్మాస్వరాజ్ యావత్ తెలంగాణకు చిన్నమ్మ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె అందించిన సహకారాన్ని రాష్ట్ర ప్రజలు మరవలేరని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఆమె తపించేవారని... తమలాంటి వారికి ఆమె స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఆమె ప్రసంగాలతో స్ఫూర్తిదామకం..! జ్ఞాపకాలు నెమరువేసుకున్న కవిత..!!
లోక్సభలో సుష్మా స్వరాజ్ ప్రసంగాలతో తాను ఎంతో స్ఫూర్తిని పొందానని.. బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మృతిపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజకీయల్లో గొప్ప నేతను కొల్పోయామని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆమె ప్రసంగాల ద్వారా తాను ఎంతో స్ఫూర్తిని పొందానని కవిత గుర్తుచేశారు. ఈమేరకు 1996లో లోక్సభలో సుష్మా స్వరాజ్ ప్రసంగ వీడియోని ఆమె ట్విటర్లో షేర్ చేశారు. చరిత్రలో ఇదొక గొప్ప ప్రసంగమంటూ ఆమె పోస్ట్ చేశారు. అప్పట్లో ఆమె ప్రసంగంపై ప్రసంసల జల్లు కురిపించారు కల్వకుంట్ల కవిత.