తెలంగాణపై సుష్మా స్వరాజ్: ఊగిపోయిన వెంకయ్య
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ సభ్యుల మధ్యే విభేదాలున్నాయని బిజెపి నేత సుష్మా స్వరాజ్ లోకసభలో అన్నారు. ఒకే పార్టీ పార్లమెంటు సభ్యులు రెండు రకాలుగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ముఖ్యమంత్రే దీక్ష చేస్తున్నారని సుస్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర సమస్య వల్ల మూడు సార్లు సభ జరగలేదని, ఇలాగే సభ వాయిదా పడితే దేశం ముందుకు సాగదని కేంద్ర మంత్రి, ఎన్సీపి నేత శరద్ పవార్ అన్నారు.
తొలుత వాయిదా పడి తిరిగి ప్రారంభమైన తర్వాత లోకసభలో ప్రశ్నోత్తరాల సమయం సాగింది. లోక్సభలో సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళనల మధ్యే స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా అరుణాచల్ప్రదేశ్ విద్యార్థి హత్యపై బీజేపీ నేత సుష్మాస్వరాజ్ చర్చను ప్రారంభించారు.
విద్యార్థి నిడో హత్యను ఖండిస్తున్నట్లు సుష్మా తెలిపారు. ఢిల్లీలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని, ఈశాన్య విద్యార్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఈశాన్య విద్యార్థులకు బీజేపీ కార్యకర్తలు అండగా ఉంటారని సుష్మాస్వరాజ్ అన్నారు.
కాగా, విఐపిలకు హెలికాప్టర్ల కొనుగోలు కోసం అగస్టా వెస్ట్ల్యాండ్ కంపెనీతో ప్రభుత్వం కుదుర్చుకున్న కాంట్రాక్టుపై చర్చ చేయాలని పట్టుబట్టిన సమయంలో రాజ్యసభలో బుధవారం వెంకయ్య నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారు. వెస్ట్ ల్యాంగ్ హెలికాప్టర్ల కుంభకోణంపై రాజ్యసభలో రభస చోటు చేసుకుంది.
బుధవారం ఉదయం రెండుసార్లు వాయిదా పడిన తర్వాత తిరిగి రాజ్యసభ ప్రారంభమైనప్పుడు వెస్ట్ల్యాండ్తో కుదుర్చుకున్న ఒప్పందంపై చర్చ చేపట్టాలని బిజెపి సభ్యులు రవిశంకర్ ప్రసాద్, వెంకయ్య నాయుడు పట్టుబట్టారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంలో వెంకయ్య నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారు. బిజెపి సభ్యులు వెల్లోకి వెళ్లి నినాదాలు చేయడంతో సభ రెండు గంటల వరకు వాయిదా పడింది.