పార్లమెంటు బయట సస్పెండైన ఎంపీల ధర్నా-పశ్చాతాపం ప్రకటిస్తేనే ఎంట్రీ అన్న వెంకయ్య
పార్లమెంటు శీతాకాల సమావేశాల మూడో రోజు కూడా ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో పార్లమెంటు బయట రాజ్యసభ నుంచి సస్పెండైన ఎంపీల ధర్నా ప్రారంభమైంది. తమ సస్పెన్షన్ కు నిరసనగా ఇవాళ్టి నుంచి ఈ సమావేశాలు ముగిసే వరకూ పార్లమెంటు బయట ధర్నా చేపట్టాలని ఎంపీలు నిర్ణయించారు.
Recommended Video
రాజ్యసభలో దురుసు ప్రవర్తనకు పాల్పడ్డారనే కారణంతో 12 మంది విపక్ష ఎంపీల్ని ఛైర్మన్ వెంకయ్య నాయుడు తాజాగా సస్పెండ్ చేశారు. ఇలా సస్పైండైన ఎంపీలు ఇవాళ పార్లమెంటు బయట ధర్నా ప్రారంభించారు. వీరికి ఇతర విపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ సస్పెండైన ఎంపీలకు బిస్కట్లు, టీ తెచ్చి ఇచ్చి సంఘీభావం ప్రకటించారు. పార్లమెంటు బయట గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న ఎంపీలకు మద్దతు పెరుగుతోంది. దీంతో కేంద్రం కూడా వీరి ధర్నాపై స్పందించింది.
గాంధీ మహాత్ముడు వీరికి సద్భుద్ది ప్రసాదించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ వ్యాఖ్యానించారు. సస్పెండ్ అయిన 12 మంది రాజ్యసభ సభ్యులు సభకు రావాలంటే పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని జోషీ కోరారు. ధర్నాలో కూర్చోనివ్వండి... మహాత్మాగాంధీ వారికి బుద్ధి చెప్పాలని ప్రార్థిస్తున్నాను: అంటూ ఆయన ట్వీట్ చేశారు. కేంద్రం కూడా ఎంపీలు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే సస్పెన్షన్ ఎత్తివేత దిశగా అడుగువేస్తామని సంకేతాలు ఇస్తోంది. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు మాత్రం సస్పైండైన విపక్ష ఎంపీలపై ఇంకా గుర్రుగానే ఉన్నారు. వీరికి తమ ప్రవర్తనపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన మరోసారి వ్యాఖ్యానించారు. 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమై పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఉమ్మడి నిరసనకు దిగాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటివరకు ప్రతిపక్షాలకు దూరంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కూడా వీరికి జత కలిసింది.
మరోవైపు ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని కోరుతూ విపక్షాలు చేపట్టిన ఆందోళనతో రాజ్యసభ కార్యకలాపాలకు ఇవాళ కూడా అడ్డంకులు తప్పలేదు. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభను ఛైర్మన్ వెంకయ్య మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా నిరసనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.