కరోనా: మళ్లీ బాంబుపేల్చిన మర్కజ్ చీఫ్.. టెర్రరిస్టులతో లింకులపై నిజాలు.. రక్తం ఇవ్వాలంటూ..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 26లక్షలకు, మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. మన దేశంలో వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరకుండానే, కేసుల సంఖ్య 20వేల మార్కును దాటింది. మరణాలు ఏడు వందలకు దగ్గరయ్యాయి. ఇప్పటిదాకా ఇండియాలో బయటపడ్డ అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ 'ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్'. మొత్తం కేసుల్లో సుమారు 30 శతం మర్కజ్ కు సంబంధించినవేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ ద్వారా ఉద్దేశపూర్వకంగానే వైరస్ వ్యాపింపజేశారని, దాన్ని టెర్రరిజంగా గుర్తించాలని అధికార బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ పై మర్డర్, మనీలాండరింగ్ కేసులు నమోదు చేశారు. ఈ దశలో తొలిసారి ఆయన మీడియా ముందుకొచ్చారు. తన లాయర్ ద్వారా అన్ని ప్రముఖ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిలో ఆయన అనూహ్య వ్యాఖ్యలతోపాటు సంచలన విషయాలూ చెప్పుకొచ్చారు. 92 ఏళ్ల తబ్లిగీ జమాతే చరిత్రలో దాని చీఫ్ మీడియాతో మాట్లాడటం ఇదే మొదటిసారి.
అక్కడేం జరిగిందంటే..
తబ్లిగీ జమాత్ గ్లోబల్ కేంద్రమైన ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో మార్చి 13-15 తేదీల్లో సామూహిక ప్రార్థనలు జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్పటికే ఢిల్లీ ప్రభుత్వం మాస్ గ్యాదరింగ్స్ పై ఆంక్షలు విధించింది. అయితే విదేశాలతోపాటు దేశం నలుమూలల నుంచి సభ్యుల రాక అప్పటికే ఖరారైన నేపథ్యంలో తాము సమావేశాలు నిర్వహించామని, దాన్ని రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వం లేదా పోలీసుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ చెప్పారు. మార్చి 23న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే తాము కూడా మర్కజ్ కార్యకలాపాలను రద్దు చేసుకన్నామని, అయితే అప్పటికే లోపల వేల మంది ఉండిపోయారని చెప్పారు. కాగా,
మీడియా కథనాలతో మలుపు..
మార్చి 24 తర్వాత నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ అధికారులతోపాటు ఆరోగ్య శాఖ సిబ్బందితోనూ మర్కజ్ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వచ్చిందని, లోపల చిక్కుకుపోయినవాళ్లను వాళ్ల ప్రాంతాలకే పంపేలా సొంతగా ఏర్పాట్లు చేసుకుంటామన్నా అధికారులు నిరాకరించారని, 25న ఆరోగ్య శాఖ సిబ్బంది మర్కజ్ ను సందర్శించిన తర్వాత మీడియాలో విస్తుగొలిపే రీతిలో కథనాలు మొదలయ్యాయని సాద్ పేర్కొన్నారు. అయితే విమర్శల్ని తాము పట్టించుకోబోమని, నిజానిజాలు బయటపడ్డ తర్వాత ఇదే మీడియా తన క్రెడిబులిటీ కోల్పోకతప్పదని ఆయన అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎక్కడున్నది, ఏం చేస్తున్నది పోలీసులు, మిగతా శాఖలకు తెలుసేనని, ఫ్యామిలీ మెంబర్లు, లాయర్లతో పోలీసులు నిత్యం చట్ లోనే ఉన్నారని సాద్ తెలిపారు. తెలుసని చెప్పారు.
టెర్రరిస్టులతో లింకులంటే..
తబ్లిగీ జమాతేలో ఏం జరుగుతుందో ముస్లిమేతరులకు పెద్దగా తెలియకున్నా, పోలీసులు, ఇంటెలిజెన్స్, ప్రపంచ గూఢచార సంస్థలన్నింటికీ స్పష్టమైన అవగాహన ఉందని మర్కజ్ చీఫ్ చెప్పారు. ‘‘తబ్లిగీ జమాత్ కు టెర్రరిజంతో ముడిపెడుతున్నారంటే తద్వారా మన పోలీసులు, ఇంటెలిజెన్స్ పరువు తీస్తున్నట్లే లెక్క. ఎందుకంటే 92 ఏళ్లుగా ఇక్కడికి ఎన్నెన్నో దేశాలు, మారుమూల ప్రాంతాల నుంచి జనం వస్తూపోతూ ఉంటారు. అందులో ఏ ఒక్కడు టెర్రరిస్టయినా ఈపాటికి సంస్థను ప్రభుత్వమే మూసేసి ఉండేది''అని సాద్ ఘాటుగా బదులిచ్చారు.
మసీదులో చనిపోదామన్నాను..
మర్కజ్ మసీదు ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఎవరూ ఊహించలేదని, అధికారులు ఆదేశించి ఉంటే కార్యక్రమాల్ని ముందే రద్దు చేసుకునేవాళ్లమని మౌలానా సాద్ అన్నారు. అయితే వైరల్ గా మారిన తన ఆడియోలు నిజమైనవేనని, అయితే అందులోని విషయాన్ని మాత్రం మీడియా వక్రీకరించిందని ఆయన ఆరోపించారు. ‘‘చనిపోవాల్సి వస్తే అందరం కలిసి మసీదులోనే చనిపోదామని నేను చెప్పిన మాటలు.. ముస్లింలలో ఐక్యతను పెంచడానికి అన్నానే తప్ప.. అందరూ వచ్చి మసీదుల్లో చనిపోండనే అర్థంలో కాదు''అని వివరించారు. మర్కజ్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసిన మీడియాపై కేసులు వేసిన వాళ్లతో తబ్లిగీ జమాత్ కు సంబంధం లేదని, పోలీసులు పెట్టిన కేసుల మీద మాత్రమే తాము ఓ నలుగురు లాయర్లను పెట్టుకున్నామని సాద్ స్పష్టం చేశారు. దేశ చట్టాలు, రాజ్యాంగంపై పూర్తిగా విశ్వాసం ఉందని, న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం ఉందని సాద్ చెప్పారు. కాగా,
తబ్లిగీల రక్తదానం..
వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లిగీలు ఇప్పుడా పొరపాటును రక్తదానాల ద్వారా చెరిపేసుకుంటున్న దృశ్యం దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నది. కొవిడ్-19 వ్యాధికిగురై క్రిటికల్ కండిషన్ లో ఉన్నవాళ్లకు ‘ప్లాస్మా చికిత్స' మెరుగైన ఫలితాలు ఇస్తుండటంతో డాక్టర్లు రక్తదానాలు కోరుతున్నారు. మామూలు వ్యక్తుల రక్తం కంటే.. కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలోని ప్లాస్మానే చికిత్సకు ఉపయోగపడుతుంది. వ్యాధి నుంచి కోలుకున్న వేల మంది తబ్లిగీలు ఇప్పటికే తమ ప్లాస్మా దానం చేశారు. రక్తదానాలకు మరింత మంది ముందుకు రావాల్సిందిగా తబ్లిగీ చీఫ్ సాద్ పిలుపునిచ్చారు.
Recommended Video
తబ్లీగీ జమాత్ అంటే..
రెగ్యులర్ జీవితంలో పడిపోయి మనిషి దేవుడికి దూరమైపోతాడు కాబట్టి.. దైనందిన జీవితానికి కాస్త బ్రేకిచ్చి.. మళ్లీ దేవుడివైపు దృష్టి మరల్చేలా చేయాలన్నదే తబ్లీగీ జమాత్ సిద్ధాంతమని, సామూహిక ప్రార్థనల్లో దైవసందేశాలు వినడం, ఖురాన్ పఠించడం లాంటి పనులు చేస్తామని, కుల, మతాలకు అతీతంగా మర్కజ్ లోకి ప్రతి ఒక్కరికీ ఆహ్వానం ఉంటుందని మౌలానా సాద్ చెప్పారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో 1927 నుంచీ ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని, నిజానికి తబ్లిగీ జమాత్.. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సంస్కణోత్యమ సంస్థ అని ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. మౌలానా సాద్ పూర్తిపేరు.. మౌలానా మహ్మద్ సాద్ కంద్లావీ. ఆయన ముత్తాత మొహ్మద్ ఇలియాజ్ కంద్లావీనే తబ్లిగీ జమాత్ ను ప్రారంభించారు.