coronavirus దూరం కావాలంటే: ఆవు పేడతో స్నానం చెయ్యండి, సర్వరోగాలు, వైరల్ !
బెంగళూరు/ చిత్రదుర్గ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారికి దూరం కావాలంటే ఇలా చెయ్యాలి.... కాదు కాదు ఇలా చెయ్యాలి అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉచిత సలహాలు ఇస్తున్నారు. కరోనా కాటు నుంచి తప్పించుకోవాలని పిచ్చి ప్రజలు చెబుతున్నట్లు పాపం అమాయకులు వాటిని ఫాలో అవుతున్నారు. ఉద్దరగా చెబుతున్న ఉచిత సలహాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనాకు దూరం కావాలంటే మీరు అవు పేడకు దగ్గర కావాలి, మీరు లక్షణంగా ఆవు పేడతో స్నానం చేస్తే కరోనా కాటు నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు, కొందరు యువకులు ఆవు పేడను నీటి తొట్టిలో వేసి స్నానం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Coronavirus: లాక్ డౌన్, రోడ్లలో హంగామా, లేడీ ఎస్ఐ పై దాడులు, కాల్చిపారేసిన పోలీసులు !
అవు పేడ అద్బుతం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలుకా బీరేనహళ్ళి సమీపంలోని హసుగళిలోని స్వర్ణభూమిలో గోశాల ఉంది. గోశాల ఆవరణంలో ఆవులకు నీళ్లు తాగించడానికి పెద్దపెద్ద నీళ్ల తొట్టలు ఏర్పాటు చేశారు. ఆ నీళ్ల తొట్టెల్లో ప్రస్తుతం ఆవు పేడ నిండిపోయింది. నీళ్లు, ఆవు పేడ కలిపిన చిక్కటి నీళ్లు అక్కడ దర్శనం ఇస్తున్నాయి.
200 ఆవుల పేడతో స్నానాలు
గోశాలలో 200కు పైగా ఆవులు ఉన్నాయి. కరోనా వైరస్ కు దూరం కావాలంటే ఆవు పేడతో స్నానం చెయ్యాలని ఓ పుణ్యాత్ముడు ఉచిత సలహా ఇచ్చాడు. అంతే గోశాలలోని 200 ఆవుల పేడతో అక్కడ ఉన్న నీటి తొట్టెలను నింపేశారు. అవు పేడ, నీళ్లు కలపడంతో అక్కడ యువకులు ప్రస్తుతం స్నానాలు చేస్తూ కరోనా వైరస్ కాటు నుంచి తప్పించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు.
గోబర్ బాత్ తో సర్వ రోగాలు మాయం
ఆవు పేడతో స్నానం చేస్తే సర్వరోగాలు నయం అవుతాయని, రోగ నిరోధక శక్తి అందుతుందని ఓ సామెత ఉంది. గోవులకు పూజ చేసినా, గో మూత్రం తాగినా రోగాల భారినుంచి తప్పించుకోవచ్చని పెద్దలు చెప్పారు. ఆవు పేడతో మీరు స్నానాలు చెయ్యాలని, రోగ నిరోధక శక్తి వస్తుందని, మీరు ఇక్కడ స్నానాలు చెయ్యడానికి తాము అన్ని ఏర్పాట్లు చేశామని గోశాల నిర్వహకుడు, గో సంరక్షుడు రాఘవేంద్ర అంటున్నారు.
గోమాత అంటే లక్ష్మీదేవి
భారతదేశంలో హిందూ ధర్మాలను, సాంప్రధాయాలను ఎక్కువ గౌరవిస్తారు. గో మూత్రంతో స్నానం చేస్తే సర్వరోగాలు దూరం అవుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం పెద్దలు చెప్పినట్లు మనం చేస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. కరోనా వైరస్ నుంచి దూరం కావాలంటే ఆవు పేడ, గో మూత్రం, నీళ్లతో స్నానం చేస్తే మీరు ఆ వ్యాధి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని గోశాల నిర్వహకులు చెప్పడంతో అక్కడి గోశాలలో యువకులు గంటల తరబడి స్నానాలు చేస్తున్నారు.
గోబర్ స్నానంతో కరోనా పరార్, వీడియో వైరల్
సర్వరోగాలకు గోబర్ స్నానం ఒక్కటే మార్గం అని గోశాల నిర్వహకుడు రాఘవేంద్ర అంటున్నారు. నెలకు ఒక్కసారైనా గోవు పేడతో స్నానం చేస్తే బ్యాక్టీరియాలు మీ దగ్గరకురావని రాఘవేంద్ర చెబుతున్నారు. మీరు చక్కగా గోవు పేడతో స్నానం చెయ్యండి, కరోనా వైరస్ కు దూరం అవుతారు అని రాఘవేంద్ర గట్టిగా చెబుతున్నారు. గోశాల నిర్వహకుల సూచనలతో అక్కడ యువకులు స్నానం చెయ్యడానికి క్యూ కట్టారు. మీరు కూడా ఇలాగే గోవు పేడతో స్నానం చెయ్యండి, కరోనాకు దూరం అవుతారు అని ఆ యువకులు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.