సింగపూర్ కు జయలలిత ? మీరు బాగుండాలి: మోడీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అనారోగ్యంతో ఉన్న జయలలిత గురువారం అర్దరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
జయలలితకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఆమె కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఆమె ఇంటికి చేరుకుంటారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే జయలలిత చికిత్స చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారని సమాచారం.
ప్రధాని నరేంద్ర మోడీ సందేశం
జయలలిత త్వరగా కోలుకోవాలని, ఆమె ఆరోగ్యంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సందేశం పంపించారు. ఎప్పటిలాగే జయలలిత ప్రజలకు సేవ చెయ్యాలని ఆయన కోరుకున్నారు. అదేవిధంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, డీఎంకే అధినేత కురుణానిధి, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ తదితర ద్రవిడ పార్టీల నాయకులు జయలలిత త్వరగా కోలుకోవాలని సందేశం పంపించారు.
ఆసుపత్రి దగ్గర జనసాగరం
చెన్నైలోని అపోలో ఆసుపత్రి దగ్గర వేలాధి మంది పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులు బారులు తీరారు. మా అమ్మకు ఏమైయ్యింది చెప్పండి అంటూ విలపిస్తున్నారు. మా అమ్మను చూపించండి అంటూ పోలీసులతో గొడవపడుతున్నారు.
కిలోమీటరు దూరం వరకు 144 సెక్షన్
అపోలో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కార్లు, బస్సులు, వ్యాన్లలో వస్తున్న జయలలిత అభిమానులు ఆసుపత్రి దగ్గర మకాం వేశారు. లోపలికి వెళ్లి మా అమ్మను చూడటానికి అవకాశం ఇవ్వాలని పోలీసులకు మనవి చేస్తున్నారు.
అన్నాడీఎంకే నేతలలో ఆందోళన
అన్నాడీఎంకే నేతలు జయలలితకు ఏమైయ్యిందని ఆందోళన చెందుతున్నారు. అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లోని దేవాలయాలు అమ్మ అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి.
జయలలితకు జ్వరం, బీపీ, షుగర్
జయలలితకు జ్వరంతో పాటు బీపీ, షుగర్ వ్యాదులు ఉన్నాయని తెలిసింది. ఆమెకు ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
విదేశాలకు అమ్మ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స చేయించుకోవడానికి సింగపూర్ వెళ్లాలని నిర్ణయించారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆరోగ్యం కుదటపడే వరకు సింగపూర్ లో చికిత్స చేయించుకోవడానికి సిద్దం అయ్యారని సమాచారం.