నాడు ఎంజీఆర్, నేడు జయ: చరిత్ర పునరావృతం అవుతుందా ?
చెన్నై: తమిళనాడులో రాజకీయ చరిత్ర పునరావృతం అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరారు.
ఎంజీఆర్ ఆసుపత్రిలో చేరిన వెంటనే అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలు వెలుగులోకి వచ్చాయి. అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు, సినీ నిర్మాత ఆర్ఎం. వీరప్పన్ నేతృత్వంలో ఓ వర్గం ఒక్కటి అయ్యింది.
ఆసుపత్రిలో ఉన్న ఎంజీఆర్ ను చూడటానికి జయలలిత అపోలో ఆసుపత్రి దగ్గరకు వెళ్లారు. ఎంజీఆర్ ను చూడటానికి వీల్లేదని వీరప్పన్ వర్గీయులు జయలలితను అడ్డుకున్నారు. ఆ సమయంలో జయలలిత వర్గీయులు మండిపడ్డారు.
1982లో అన్నాడీఎంకేలో చేరిన జయలలిత అతిత్వరలోనే ముఖ్య నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. జయలలిత పేరు తెచ్చుకోవడం వీరప్పన్ వర్గీయులకు ఇష్టం లేదు. జపాన్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం వైద్యులు ఎంజీఆర్ కు చికిత్స చేస్తున్నారని అప్పట్లో జయలలిత మీడియాకు చెప్పి పార్టీ తరపున ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆ విషయం జీర్ణించుకోలేని వీరప్పన్ వర్గీయులు జయలలిత వ్యాఖ్యలను ఖండించారు. జయకు షోకాజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. తరువాత ఎంజీఆర్ అనారోగ్యంతో మరణించారు. పార్టీ మీద పట్టు సాధించిన జయలలిత అన్నాడీఎంకేలో తిరుగులేని నాయకురాలు అయ్యారు.
ఇదంతా గతం. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. లండన్ నుంచి ప్రత్యేక వైద్యుడు వచ్చి చికిత్స చేస్తున్నారు. జయలలిత ఆరోగ్యంపై రోజుకోక పుకారు చక్కర్లు కొడుతుంది.
జయలలిత వారుసులు ఎవరు అని చర్చ జరుగుతుంది. జయలలిత తన వారసుడు ప్రముఖ నటుడు అజిత్ కుమార్ అని వీలునామా రాశారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. అయితే ఆమె సన్నిహితులు మాత్రం ఆ వార్తను ఇప్పటి వరకు ఖండించలేదు.
జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప ఇటీవల ఆసుపత్రి దగ్గరకు వెళ్లి జయలలిత వారసురాలు నేనే అంటూ హంగామా చేశారు. అయితే జయలలితను చూడటానికి అన్నాడీఎంకే నాయకులు ఆమెకు అవకాశం ఇవ్వలేదు.
ఇప్పుడు గతంలో జరిగిన పరిస్థితి కనపడుతుంది. జయలలిత కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పూజలు, ప్రత్యేక హోమాలు చేస్తున్నారు. అన్నదానం చేస్తున్నారు. ఎంజీఆర్ వారసురాలు అయిన జయలలితకు ఇప్పుడు ఆమె వారసలు ఎవరు ? అని కచ్చితంగా తెలియడం లేదు.