Tamil Nadu Chopper Crash: ఆ అధికారి కూడా కన్నుమూత: మృత్యువుతో పోరాడుతూ
బెంగళూరు: తమిళనాడులోని సుళ్లూరు-కూనూర్ మధ్య నీలగిరి పర్వతాల్లో సైన్యానికి హెలికాప్టర్ కుప్పకూలిపోయిన ఘటనకు సంబంధించిన మరో బ్యాడ్ న్యూస్ అందింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక అధికారి, గ్రూప్ కేప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. మృత్యువుతో పోరాడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైమానిక దళాధికారులు కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నామని చెప్పారు.
హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్ను బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే. బెంగళూరులో వైమానిక దళానికి చెందిన కమాండ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. తొలుత- తమిళనాడులోని వెల్లింగ్టన్లోని మిలటరీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరుణ్ సింగ్ను బెంగళూరుకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఆర్మీకి చెందిన ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. కమాండ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ మీదే ఉంటోన్నారు. అత్యాధునిక వైద్య చికిత్సను అందించారు డాక్టర్లు. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 45 శాతం కాలిన గాయాలయినట్లు నిర్దారించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. లైఫ్ సపోర్ట్ మీదే ఆయనకు చికిత్స అందించారు. అయినప్పటికీ.. వరుణ్ సింగ్ కోలుకోలేకపోయారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైమానిక దళాధికారులు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
IAF is deeply saddened to inform the passing away of braveheart Group Captain Varun Singh, who succumbed this morning to the injuries sustained in the helicopter accident on 08 Dec 21. IAF offers sincere condolences and stands firmly with the bereaved family.
— Indian Air Force (@IAF_MCC) December 15, 2021
తమిళనాడులో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా 13 మంది కన్నుమూసిన విషయం తెలిసిందే. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్ నాయక్ బీ సాయితేజ.. ఇతర అధికారులు ఉన్నారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉన్నారు. గ్రూప్ కేప్టెన్ వరుణ్ సింగ్ మినహా అందరూ మరణించారు. తాజాగా ఆయన కూడా కన్నుమూశారు.
వరుణ్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సమాచారం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఆయన ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకున్నానని చెప్పారు. వరుణ్ సింగ్ దేశానికి అందించిన సేవలను చిరస్మరణీయమని చెప్పారు. ఆయన చేసిన సేవలను విస్మరించలేనమి, చిరకాలం గుర్తిండిపోతాయని అన్నారు. వరుణ్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు.
Group Captain Varun Singh served the nation with pride, valour and utmost professionalism. I am extremely anguished by his passing away. His rich service to the nation will never be forgotten. Condolences to his family and friends. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 15, 2021
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, త్రివిధ దళాలకు చెందిన పలువురు అధికారులు వరుణ్ సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, హోం శాఖ మంత్రి జ్ఞానేంద్ర అగర, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంతాపాన్ని తెలిపారు.