పరీక్ష రాస్తూ ప్రసవించిన విద్యార్థిని.. 70 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్.. లాక్డౌన్కు ముందురోజు ఘటన
ఒక్క రోజు ఆలస్యమై ఉంటే ఆ కీచక వృద్ధుడి దాష్టీకం బయటి ప్రపంచానికి తెలిసేదికాదేమో.. ఇంటి పక్కనే ఉంటోన్న అమాయకురాలైన విద్యార్థినికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న అతను.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కొన్నాళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ, గర్భందాల్చేలా చేశాడు.. గుట్టుచప్పుడు కాకుండా కడుపు తీయించేస్తానని ఆమెకు మాటిచ్చాడు.. కానీ అనూహ్యరీతిలో అతని దుశ్చర్య బయటపడింది. తమిళనాడులోని నమక్కళ్ జిల్లా నమన్గిరిపెట్లైలో చోటుచేసుకున్న ఈ దారుణంపై పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

అండగా ఉంటానంటూ..
పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని స్థానిక పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. ఐదేళ్ల కిందటే తండ్రి చనిపోయాడు. తల్లి కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. వాళ్ల ఇంటి పక్కనే ఉండే 70 ఏళ్ల వృద్ధుడు.. అండగా ఉంటానంటూ విద్యార్థినికి దగ్గరై.. క్రమంగా ఆమెను లోబర్చుకున్నాడు. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటన వెలువడటానికి ముందు రోజు, అంటే మంగళవారం ఆమె ఎనిమిది నెలల కడుపుతో వార్షిక పరీక్షలు రాయడానికి వెళ్లింది..

ఎగ్జామ్ హాలులో నొప్పులు..
తోటి విద్యార్థులతో కలిసి పరీక్ష రాస్తుండగా, సడెన్ గా నొప్పులు రావడంతో ఆ విద్యార్తిని.. బాత్రూమ్ కు వెళతానని ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకుంది. అలా వెళ్లినామె ఎంతకీ తిరిగిరాకపోవడంతో ఇన్విజిలేటర్ కంగారు పడింది. అనుమానం వచ్చి బాత్రూమ్ కు వెళ్లి చూడగా.. రక్తపుమడుగులో విద్యార్థిని పడిఉండటాన్ని గుర్తించి టీచర్ షాకైంది. వెంటనే ఆంబులెన్స్, పోలీసులకు కబురు పెట్టింది.

తప్పిన ప్రాణాపాయం..
సమయానికి ఆంబులెన్స్ రావడంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నవయసు కారణంగా బలహీనంగా ఉండటంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం లేదని తెలిసిన వెంటనే పోలీసులు.. ఆ విద్యార్థిని ప్రశ్నించి, కీచకుడి వివరాలు రాబట్టారు. ఈలోపే బాధితురాలి తల్లి ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించింది. ఆమె ద్వారా ఫిర్యాదు తీసుకున్న పోలీసులు బాధితురాలి ఇంటివైపు కదిలారు..

కఠిన శిక్షలు వేయాలంటూ..
విద్యార్థినిపై కొద్దిరోజులుగా అత్యాచారానికి పాల్పడుతోన్న 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించడంతో పోక్సో తదితర చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితుణ్ని తమకు అప్పగించాలంటూ బాధితురాలి కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టారు. కఠిన శిక్షలు పడేలా చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారంతా వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications