భారీ వర్షంలో చిక్కుకున్న జయ కాన్వాయ్: మృతులు 71 (ఫోటో)
చెన్నై: తమిళనాడులోని భారీ వర్షాలు సామాన్య ప్రజలకే కాకుండా ముఖ్యమంత్రి జయలలితకు కూడా చిక్కులు తెచ్చి పెట్టాయి. వర్షాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్లో సోమవారంనాడు ఆమె కాన్వాయ్ కొద్ది సేపు చిక్కుకుంది. వర్షాలతో తీవ్రంగా దెబ్బ తిన్న తన నియోజకవర్గం డాక్టర్ రాధాకృష్ణ నగర్ో పర్యటించేందుకు వెళ్లినప్పుడు ఆమె కాన్వాయ్ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంది.
చెన్నైతో పాటు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి 71 మంది మరణించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని జయలలిత పిలుపునిచ్చారు. ఆందోళన చెందవద్దని, తాను ఉన్నానని జయలలిత ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని అన్నాడియంకె అధికారిక ప్రతినిధి ట్వీట్ చేశారు.
ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని, అయితే మూడు నెలల పాటు కురవాల్సిన వర్షాలు కొద్ది రోజుల్లో పడడం వల్ల అవి సరిపోలేదని, తీవ్రమైన నష్టం వాటిల్లిందని జయలలిత అన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై సహాయ చర్యలు చేపడుతోందని ఆమె చెప్పారు. పోలీసులు, పైర్, రెస్క్యూ సిబ్బంది రాత్రింబవళ్లు సహాయపునరావాస కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ప్రభుత్వ యంత్రాంగం రాత్రింబవళ్లు పనిచేస్తోందని ఆమె అన్నారు. అంతకు ముందు సీనియర్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మరీనా బీచ్ వంటి ప్రఖ్యాత స్థలాలు వరదలతో నిండిపోయాయి. తమిళనాడు రాజధానిలోనూ సముద్ర తీరంలోని ఇతర ప్రాంతాల్లోనూ సోమవారం కూడా వర్షాలు కురుస్తున్నాయి.
విద్యాసంస్థలను మూసేశారు. సబర్బన్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమోట కిలో ధర వంద రూపాయలు పలుకుతోంది.