జయలలిత చికిత్స కోసం సింగపూర్ రోబో !
చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫిజియోథెరపీ చికిత్స చెయ్యడానికి సింగపూర్ నుంచి ప్రత్యేక రోబోను తెప్పించారని తెలిసింది. గత రెండు నెలలకు పైగా అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
జయలలిత 90 శాతం వరకు సహజరీతిలో శ్వాస తీసుకుంటున్నారని, ఆమె నడవడమే తరువాయి అని అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ. రెడ్డి ఇటీవలే చెప్పారు. కాలర్ మైక్ సహాయంతో జయలలిత మెల్లిగా మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో జయలలితకు ప్రత్యేక చికిత్స చెయ్యడానికి అపోలో ఆసుపత్రికి సింగపూర్ నుంచి ఓ రోబోను తీసుకువచ్చారని సమాచారం. సింగపూర్ లోని మౌంట్ ఎలిజిబెత్ ఆసుపత్రి రోబోటిక్ ఫిజియోథెరపీకి ప్రపంచ ప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే.
సింగపూర్ మౌంట్ ఎలిజిబెత్ ఆసుపత్రి నుంచి వచ్చిన ఇద్దరు మహిళా వైద్యులు సీఎం జయలలితకు ఫిజియోథెరపీ చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు సింగపూర్ నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన రోబో తో జయలలితకు చికిత్స చేయిస్తారని తెలిసింది. అయితే అపోలో ఆసుపత్రి వర్గాలు మాత్రం సింగపూర్ నుంచి రోబోను తీసుకు వచ్చామని అధికారికంగా ప్రకటించలేదు.
అమ్మ ఆప్తురాలు శశికళకు అస్వస్థత ?
జయలలిత ఆప్తమిత్రురాలు, అత్యంత ఆప్తురాలైన నెచ్చలి శశికళ అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. గత రెండు నెలల నుంచి విరామం లేకుండా జయలలితను కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉన్న కారణంగా అస్వస్థతకు గురైన శశికళ ఇటీవల అపోలో ఆసుపత్రిలో చేరారని తెలిసింది. అయితే ఈ విషయంపై అన్నాడీఎంకే నాయకులు మాత్రం ఏవిధంగానూ స్పందించలేదు.