విజయ్ జంబో కేబినెట్: మరో ఇద్దరు ప్రమాణం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. తాజాగా మరో ఇద్దరు మంత్రులు ఆయన కేబినెట్ లో చేరారు. కొద్దిసేపటి కిందటే చెన్నై లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్, ఆయన మంత్రివర్గ సహచరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మిత్రపక్షాలైన విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఈ తాజా విస్తరణతో క్యాబినెట్ మంత్రుల సంఖ్య 34కి చేరింది. లోక్ భవన్లో వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు వన్ని అరసు, ఎంఎం షాజహాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేరికతో ఈ రెండు పార్టీలు అధికారికంగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగం అయ్యాయి. 23 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ విస్తరణ చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ విస్తరణ దళిత ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచింది. వన్ని అరసు చేరికతో, క్యాబినెట్లో దళిత మంత్రుల సంఖ్య ఎనిమిదికి చేరింది. తమిళనాడు చరిత్రలో ఇంత ఎక్కువ దళిత దామాషా ప్రాతినిధ్యం మునుపెన్నడూ లేదు. మిత్రపక్షమైన కాంగ్రెస్ నుండి రాజేష్ కుమార్, పీ విశ్వనాథన్ ఇదివరకే మంత్రివర్గంలో చేరారు. వీరి చేరిక దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడులో కాంగ్రెస్ అధికార కూటమిలో భాగం అయింది.
1967లో ఎం భక్తవత్సలం తర్వాత తమిళనాడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి విజయ్ మే 10న తొలిసారిగా తొమ్మిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గురువారం 23 మంది ఎమ్మెల్యేలతో మంత్రివర్గాన్ని విస్తరించారు. తాజాగా మరో ఇద్దరు మంత్రులను కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో మంత్రుల సంఖ్య 34కు చేరింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తమిళనాడులో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 35 మంది సభ్యులు ఉండవచ్చు. అంటే ఇంకా ఒక స్థానం ఖాళీగా ఉంది.
గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో శ్రీనాథ్, కమలి ఎస్, సీ విజయలక్ష్మి, ఆర్వీ రంజిత్కుమార్, వినోత్, రాజీవ్, బీ రాజ్కుమార్, వీ గాంధీరాజ్, మాథన్ రాజా పీ, జగదీశ్వరి, రాజేష్ కుమార్, ఎం విజయ్ బాలాజీ, లోకేష్ తమిళసెల్వన్, విజయ్ తమిళన్ పార్థిబన్, రమేష్, పీ విశ్వనాథన్, ఆర్ కుమార్, కే తెన్నరసు, వీ సంపత్ కుమార్, మహ్మద్ ఫర్వాజ్, డీ శరత్కుమార్, ఎన్ మేరీ విల్సన్, విఘ్నేష్ ఉన్నారు. ఇప్పుడు తాజాగా వన్ని అరసు, ఎంఎం షాజహాన్ చేరారు.












Click it and Unblock the Notifications