జైలుకెళ్లిన సీఎం విజయ్.. ఖైదీలతో ముచ్చట్లు! పోలీస్ స్టేషన్ లోనూ షాకింగ్ ఎంట్రీ
తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శుక్రవారం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. చెన్నైలోని దేశంలోనే అతిపెద్ద జైలు సముదాయాలలో ఒకటైన పుళల్ సెంట్రల్ జైలును ఆయన అకస్మాత్తుగా సందర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా ముఖ్యమంత్రి నేరుగా జైలు బాట పట్టడంతో జైలు అధికారులు, భద్రతా దళాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఖైదీలకు అందుతున్న ప్రాథమిక వసతులు, వైద్య సేవలు, ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించడమే లక్ష్యంగా సీఎం ఈ తనిఖీలు నిర్వహించారు.
పుళల్ జైలు-1 ప్రాంగణంలో అడుగుపెట్టిన సీఎం విజయ్, అక్కడి సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్వారంటైన్ జోన్, ఖైదీల బంధువుల సందర్శకుల హాలు, జైలు ఆసుపత్రి, రీ హ్యాబిటేషన్ సెంటర్, మహాత్మా గాంధీ కమ్యూనిటీ కాలేజ్ తరగతి గదులతో పాటు గ్రంథాలయం, కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అంతేకాకుండా, అత్యంత భద్రత కలిగిన హై-సెక్యూరిటీ బ్లాక్, ఉరిశిక్ష అమలు చేసే ప్రాంతాలను కూడా ఆయన స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు.

ఉత్పత్తి కేంద్రాల్లో ఖైదీల నైపుణ్యం పరిశీలన
జైలులోని వృత్తి విద్యా శిక్షణా కేంద్రాలను సందర్శించిన సీఎం, ఖైదీలు తయారుచేస్తున్న ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. కూరగాయల ర్యాక్లు, కాగితపు కవర్లు, ఆఫీసు ఫైళ్ల తయారీ విభాగాలను వీక్షించారు. అలాగే పవర్ లూమ్ యూనిట్లో దుప్పట్లు, ఇతర దుస్తుల తయారీ విధానాన్ని, టైలరింగ్ యూనిట్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. జైలు గోడల మధ్య ఖైదీలు సొంతంగా ఉపాధి వైపు అడుగులు వేస్తుండటంపై అధికారులను అభినందించారు.
ఆహారం నాణ్యత పరీక్ష.. ఖైదీల కష్టసుఖాలపై విచారణ
జైలు వంటగదికి వెళ్లిన విజయ్, ఖైదీలకు రోజువారీగా వడ్డిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా పరీక్షించారు. అనంతరం నేరుగా ఖైదీలతో మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జైలులో వారికి ఎదురవుతున్న ఇబ్బందులు, అవసరాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకుంటూ సీఎం నేరుగా వారితో ముచ్చటించడం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.
పోలీస్ స్టేషన్లో కూడా ఆకస్మిక తనిఖీలు
జైలు పరిశీలన ముగిసిన వెంటనే సీఎం విజయ్ సమీపంలోని ఎం-3 పుళల్ పోలీస్ స్టేషన్ను కూడా సందర్శించారు. స్టేషన్ ఇన్స్పెక్టర్తో రోజువారీ కార్యకలాపాల గురించి చర్చించారు. కేస్ రిజిస్టర్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, సబ్ ఇన్స్పెక్టర్ గది, సైబర్ సెల్, స్టేషన్ డేటా స్టోరేజ్ రూమ్, లాకప్ గదులను తనిఖీ చేశారు. ఈ హఠాత్ పర్యటనలో జైళ్ల శాఖ డీజీపీ సందీప్ రాయ్ రాథోర్, డీఐజీ టి. పళని, జైలు సూపరింటెండెంట్ కృష్ణరాజ్ తదితర ఉన్నతాధికారులు సీఎం వెంట ఉన్నారు.














Click it and Unblock the Notifications