Tamil Nadu Election Results: అక్కడ వార్ వన్ సైడ్: పదేళ్ల తరువాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సూర్యోదయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎవరు విజేతలు? ఎవరు పరాజితులనేది ఈ మధ్యాహ్నానికి తేలిపోనుంది. ఇక ఏపీలోని తిరుపతి లోక్సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితాలు కూడా వాటితోపాటు వెల్లడి కానున్నాయి.
ఇద్దరు రాజకీయ దురంధరులు, మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత లేని ఎన్నికలను తమిళనాడు అసెంబ్లీ ఎదుర్కొంది. ఆ ఇద్దరు నేతల వారసులుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే అధినేత, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఈ ఎన్నికల్లో తలపడ్డారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఏఐఏడీఎంకే.. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది. ఎగ్జిట్ పోల్స్ డీఎంకే వైపే మొగ్గు చూపాయి. ఎంకే స్టాలిన్ సారథ్యంలోని ప్రారంభ ఫలితాల్లో డీఎంకే దూసుకెళ్తోంది.
భారీ ఆధిక్యతను కనపరుస్తోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల మధ్య ఉన్న ఆధిక్యతలో చెప్పుకోదగ్గస్థాయిలో తేడా కనిపిస్తోంది. ఏఐఏడీఎంకేతో పోల్చుకుంటే.. సగం స్థానాలకు పైగా డీఎంకే లీడ్లో ఉంటోంది. 52 స్థానాల్లో డీఎంకే 33 చోట్ల అన్నా డీఎంకే లీడ్లో కొనసాగుతున్నాయి. ఎఎంఎంకే ఒక స్థానంలో లీడ్లో ఉంది. కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీథి మయ్యం ఏ మాత్రం ప్రభావం చేపలేకపోయినట్టు కనిపిస్తోంది. ప్రారంభ రౌండ్లలో ఆ పార్టీ ఎక్కడా కూడా ఆధిక్యతలోకి రాలేదు.
Recommended Video
కేరళలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ముందంజంలో కొనసాగుతోంది. ఎల్డీఎఫ్ 75, యూడీఎఫ్ 49 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. బీజేపీ నాలుగు చోట్ల, ఇతరులు ఒక స్థానంలో లీడ్లో ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ నెలకొంది. బీజేపీ దాని మిత్రపక్షాలు ఆరు చోట్ల.. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు నాలుగు చోట్ల ఆధిక్యతలో ఉన్నాయి.