తమిళనాడులో తాబేలు పాలన పతనం, స్టాలిన్ పగటి కలలు, నేనే వస్తా: పన్నీర్ !
తమిళనాడులో తాబేలు పాలన కొనసాగుతోందని, త్వరలో ఆపాలన తెరమరుగు అవుతోందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే, ఆపార్టీ కార్యకర్తలకు ద్రోహం చెయ్యడానికి ప్రయత్నించిన శశికళ,
చెన్నై: తమిళనాడులో తాబేలు పాలన కొనసాగుతోందని, త్వరలో ఆపాలన తెరమరుగు అవుతోందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జోస్యం చెప్పారు. విల్లుపురం జిల్లా అన్నాడీఎంకే (పురుచ్చి తలైవి) పార్టీ ఆధ్వర్యంలో ఎంజీఆర్ జయంతి ఉత్సవాల కార్యాక్రమాలు ఏర్పాటు చేశారు.
ఎంజీఆర్ జయంతి ఉత్సవాలతో పాటు పార్టీ అభివృద్ది కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికల సమాలోచన సమావేశం ఏర్పాటు చేశారు. విల్లుపురంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలోని మునిసిపాలిటి మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పన్నీర్ సెల్వం హాజరైనారు.

122 మంది ఎమ్మెల్యేలతో ఓ తాబేలు
తమిళనాడులో 122 మంది ఎమ్మెల్యేలతో తాబేలు పాలన కొనసాగుతోందని పన్నీర్ సెల్వం ఎద్దేవ చేశారు. ఎడప్పాడి పళనిసామి తాబేలు పాలన చూసి ప్రజలు విసిగిపోతున్నారని చెప్పారు. తాబేలు లాగే నత్తనడకన సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులు ముందుకు సాగుతున్నాయని పన్నీర్ సెల్వం విమర్శించారు.

జయలలిత అంటే విలువలేదా ?
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేశారని పన్నీర్ సెల్వం గుర్తు చేశారు. అలాంటి అమ్మ అనుమానాస్పదస్థితిలో మరణించారని, ఆమె మరణంపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసి 100 రోజులు అయినా ఎడప్పాడి పళనిసామి పట్టించుకోవడం లేదని పన్నీర్ సెల్వం విచారం వ్యక్తం చేశారు.

స్టాలిన్ పగటి కలలు కంటున్నారు !
అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిందని, తాము ముఖ్యమంత్రి అవుతానని ఎంకే. స్టాలిన్ పగటి కలలు కంటున్నారని పన్నీర్ సెల్వం ఎద్దేవ చేశారు. అయితే ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని పన్నీర్ సెల్వం అన్నారు.

10 ఏళ్లు అమ్మ పాలనే, నేనే వస్తా !
అమ్మ జయలలిత కలలు కన్న పాలన 10 ఏళ్లు కొనసాగుతోందని, అందులో ఎలాంటి సందేహం లేదని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత, రెండాకుల చిహ్నం చూసి ప్రజలు అన్నాడీఎంకేకి ఓటు వేశారని గుర్తు చేశారు.
తానే మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తానని పన్నీర్ సెల్వం పరోక్షంగా చెప్పారు.

జయలలితకు ద్రోహం చేసిన శశికళ
జయలలిత నమ్మకంతో శశికళను తన దగ్గరకు తీసుకుని ఆదరించినందుకు ఆమె దేవత లాంటి అమ్మకు ద్రోహం చేశారని ఇదే సందర్బంలో పన్నీర్ సెల్వం మండిపడ్డారు. తమిళనాడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి శశికళ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని పన్నీర్ సెల్వం ఆరోపించారు.

చిప్పకూడే గతి
అన్నాడీఎంకే, ఆపార్టీ కార్యకర్తలకు ద్రోహం చెయ్యడానికి ప్రయత్నించిన శశికళ, టీటీవీ దినకరన్ లకు జైలే గతి అని పన్నీర్ సెల్వం అన్నారు. అధికారం కోసం ఆరాటపడిన వారికి దేవుడు సరైన శిక్ష వేశారని, శశికళ కుటుంబ సభ్యులను చూస్తే అన్నాడీఎంకే కార్యకర్తలకు చీదరించుకుంటారని చెప్పారు.

ఒక్కటైన నాయకులు
స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పన్నీర్ సెల్వం చేపట్టిన రాష్ట్ర పర్యటనకు ప్రజలు, కార్యకర్తల నుంచి ఊహించని మద్దతు వస్తోంది. ఈ సమావేశంలో పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకులు మధుసూదనన్, మైత్రేయన్, రాజేంద్రన్, విల్లుపురం జిల్లా కార్యదర్శలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గోన్నారు.












Click it and Unblock the Notifications