స్టాలిన్ మార్క్ గవర్నెన్స్: సాహసోపేత నిర్ణయం: తోటి ముఖ్యమంత్రులకు ఆదర్శంగా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకుని, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోవడానికి సాహసించని నిర్ణయం అది. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఊరట కలిగించాచారు. దీనికోసం సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారాయన. కోవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియోను ప్రకటించారు.
Omicron: బయోలాజికల్ యుద్ధానికి సనద్ధం కావాల్సిందే: కౌంటర్ అటాక్ తప్పదు
మృతుల కుటుంబాలకు..
అలాంటి కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక పరిహారాన్ని చెల్లిస్తామని అన్నారు. దీనికి అవసరమైన ఉత్తర్వులు కూడా ఈ మధ్యాహ్నం విడుదలయ్యాయి. తమిళనాడులో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటిదాకా 36 వేల మందికి పైగా మరణించారు. సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. అక్కడ కోవిడ్ వల్ల 36,481 మంది మృతి చెందారు. ఆయా కుటుంబాలన్నింటికీ 50 వేల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను చెల్లిస్తుంది తమిళనాడు ప్రభుత్వం.
ఎస్డీఆర్ఎఫ్ నుంచి
స్టేట్ డిజాస్టర్ రెస్పాండ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం కరోనా వైరస్ వల్ల చనిపోయిన మొట్టమొదటి వ్యక్తికి చెందిన కుటుంబం మొదలుకుని సోమవారం వరకు నమోదు చేసిన రికార్డులను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ఈ పరిహారం చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వారికి మినహాయింపు..
ప్రస్తుతం కరోనా బారిన పడి మరణించిన ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నష్ట పరిహారాన్ని చెల్లిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. అలాగే- కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన పిల్లలకు అయిదు లక్షల రూపాయలు, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు మూడు లక్షల రూపాయలను చెల్లిస్తోంది. ఈ చెల్లింపులన్నీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేస్తోంది. అలాంటి వారిని మినహాయింపు ఇచ్చింది.
స్టాలిన్ మార్క్ గవర్నెన్స్..
ఇప్పటికే సీఎంఆర్ఎఫ్ కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతున్నందున.. ఆ కుటుంబాలకు ఈ తాజా ఉత్తర్వులు వర్తించవు. కాగా తమిళనాడు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆకట్టుకుంటోంది. తోటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరించేలా ఉంటోంది. ఇదివరకు పెట్రోల్ అమ్మకాలపై అమ్మకం పన్నును మూడు రూపాయల మేర తగ్గించిన మొట్టమొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నారు.