ఈ రాష్ట్ర ప్రభుత్వం 3వేల గ్రామాల పేర్లు మార్చుతోంది..ఎందుకో చూడండి
తమిళనాడు: బీజేపీ అధికారంలోకి వస్తే పలు నగరాల పేర్లను మారుస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తన ప్రచారంలో చెప్పారు. బీజేపీకి ఆ ఛాన్స్ దక్కలేదు. తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 3వేలకు పైగా ప్రాంతాల పేర్లను మార్చేందుకు నిర్ణయించింది. ఇందులో ట్రిప్లికేన్ను తిరువల్లికేనిగా, త్రిచిని తిరుచిరప్పల్లిగా తుతుకోరిన్ను తూత్తుకుడిగా, పూనమల్లేను పూవిరుందవల్లిగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో జీవోను విడుదల చేస్తామని ఆ రాష్ట్ర అధికార భాషా మరియు సాంస్కృతిక శాఖ మంత్రి పాండియరాజన్ తెలిపారు. రెండు వారాల సమయంలో ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
32 జిల్లాల్లో ఏ ప్రాంతంలో పేర్లను మార్చాలనేదానిపై ఓ హైలెవెల్ కమిటీ నియమించి నివేదిక అందించిన తర్వాత ప్రభుత్వం ప్రాంతాల పేర్లను మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రాంతాల పేర్లను మార్చేందుకు ప్రముఖ చరిత్రకారులనుంచి తమిళ మేధావుల సూచనలను కమిటీ తీసుకుంది. ఇదిలా ఉంటే ఉత్తర్ప్రదేశ్లో పలు నగరాల పేర్లను మార్చింది యోగీ సర్కార్. తమిళనాడులో ప్రాంతాల పేర్లను మార్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ... తమిళనాడు సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పేర్లను మార్చాల్సి ఉండగా ఆలస్యం అయ్యిందని అభిప్రాయపడింది.

"పేర్ల మార్పు చాలా రోజుల క్రితమే జరిగి ఉండాల్సి ఉందని ఇప్పటికే ఆలస్యమైంది. గ్రామాలు, వీధుల పేర్లు మంచి అర్థం వచ్చేట్లుగా పెట్టాలి. ప్రతి గ్రామం, వీధికి ఉన్న చరిత్ర తెలిసేలా పేరుఉండాలి. కొత్త తరం వారికి చరిత్ర తెలిసేలా పేర్లు ఉండాలి. ఆలస్యం అయినప్పటికి ఇది తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం" అని అన్నారు బీజేపీ ప్రతినిధి నారాయణన్ తిరుపతి. మరోవైపు కొన్ని పేర్లను చరిత్రలో గుర్తుండిపోయేందుకు అలానే ఉంచాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బ్రిటీషు వారు చేసిన మేలులను గుర్తిస్తూ నాడు రాష్ట్రంలో పలు ప్రాంతాలకు వారి పేర్లను పెట్టారని...అలాంటి పేర్లను తీసివేయకూడదని చెప్పారు తంతై పెరియార్ ద్రవిడార్ కజగం పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణన్.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో చాలా పేర్లను మార్చాల్సి ఉందన్నారు. కులం ఆధారంగా ఆ పేర్లు ఉన్నాయని వాటిని మార్చాలని చెప్పారు. ఉదాహరణకు గౌండర్ పల్లాయం, నాయకర్ పల్లాయం, పల్లాపల్లాయం లాంటి పేర్లను పరిగణలోకి తీసుకోవడంతోపాటు నాటి ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ జారీచేసిన ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకుని మార్చాలని రామకృష్ణన్ చెప్పారు. 1979లో ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీధులకు, ప్రాంతాలకు కుల ప్రాతిపదికన ఏర్పడ్డ పేర్లను తీసివేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications