తమిళనాడులో వద్దంటే వాన.. వణికిన చెన్నై, వచ్చే 24 గంటల్లో అతి భారీ వర్షాలు..
భారీ వర్షాలు తమిళనాడును వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై సహా పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. కుండపోతతో చెన్నైలో సాధారణ జనజీవనం స్తంభించింది.
చెన్నై: భారీ వర్షాలు తమిళనాడును వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై సహా పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. కుండపోతతో చెన్నైలో సాధారణ జనజీవనం స్తంభించింది.
ప్రధాన రహదారులూ జలమయమయ్యాయి. చెన్నై నగరంలోని జీఎస్టీ రోడ్, అన్నాసలై సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలకు తంజావూర్ జిల్లాలో గోడ కూలిన ఘటనలో ఓ వ్యక్తి మరణించారు.
తమిళనాడులోని చెన్నై, కడలూరు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, నాగపట్టణం, తంజావూర్, తిరువారూర్, రామనాథపురం తదితర ప్రాంతాల్లో ఈ వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఎనిమిది తీర ప్రాంతాలతో పాటుగా ఆ రాష్ట్ర రాజధాని చెన్నై లోనూ రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సోమవారం వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అధిక పీడనమే ఈ వర్షాలకు కారణమని, రాబోయే 5 రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం తమిళనాడుపై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఆదివారం రాత్రి నుండే ప్రారంభమైన వర్షాలు సోమవారం నాటికి తీవ్ర రూపం దాల్చడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ర్ట ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల తమిళనాడు, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, నాగపట్నం జిల్లాల్లోని పాఠశాలలకు తమిళనాడు ప్రభుత్వం రేపు సెలవుగా ప్రకటించింది.