తమిళనాడులో 'ఠాగూర్' సీన్ రిపీట్: మృతదేహానికి మూడ్రోజులు వైద్యం
నాగపట్టణం: చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమాలో డాక్టర్లు మృతదేహానికి వైద్యం చేస్తారు. అచ్చం అలాంటి సంఘటన తమిళనాడులోను నాగపట్టణంలో శనివారం జరిగింది. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తున్నామని నమ్మిస్తూ బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసింది ఓ ప్రయివేటు ఆసుపత్రి.
నాగపట్టణం జిల్లాకు చెందిన శేఖర్కు(55) ఈ నెల తొమ్మిదో తేదిన కడుపునొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. నొప్పి ఎక్కువ కావడంతో తంజావూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ శేఖర్కు ఆపరేషన్ చేయాలని రూ.5 లక్షలు వసూలు చేశారు. రెండ్రోజుల తర్వాత మరో రూ.3 లక్షలు అడిగారు. కొడుకు సుభాష్కు అనుమానం వచ్చింది.
తన తండ్రిని డిశ్చార్జ్ చేస్తే వేరే ఆసుపత్రికి తీసుకు వెళ్తామని చెప్పారు. వెంటనే డిశ్చార్జ్ కుదరదని చెప్పారు. ఆసుపత్రికి కుటుంబ సభ్యులంతా వచ్చారు. అయితే, మీ తండ్రి ముందు రోజు రాత్రి తీవ్రమైన కడుపు నొప్పితో చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. మృతదేహంతో ధర్నాకు దిగారు. తమ తండ్రి చనిపోయి మూడ్రోజులైనా చెప్పకుండా లక్షలు వసూలు చేశారని వారు ఆరోపించారు.
తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుంచి ఒక్కసారి చూడనివ్వలేదని, వేరే ఆసుపత్రికి తీసుకు వెళ్తామని చెప్పగానే అసలు విషయం చెప్పారని, ఇందుకు గాను ఆసుపత్రి సిబ్బందిని కఠినంగా శిక్షించాలని మృతుడి కొడుకు డిమాండ్ చేశారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం దీనిని కొట్టి పారేసింది. తమ ఆసుపత్రికి చెడ్డపేరు తీసుకు రావడానికి ఇలా చేశారని ఆరోపించారు.