భార్య లోదుస్తులు ఉతకలేదని మహిళా ఉద్యోగికి జడ్జీ నోటీసు
చెన్నై: తమిళ జడ్జిలు అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తన బదిలీ స్టే ఇచ్చుకున్న జడ్జి ఘటన మరువక ముందే తమిళనాడు న్యాయవ్వవస్థలో మరో కలకలం చోటు చేసుకుంది. తన భార్య లోదుస్తులు ఉతకడం లేదనే కోపంలో తమిళనాడులోని కింది కోర్టు జడ్జి తన కింద పనిచేసే మహిలా ఉద్యోగికి ఏకంగా నోటీసులు జారీ చేశారు.
నోటీసులకు వారంలోగా వివరణ ఇవ్వాలని కూడా ఆ మహిళా ఉద్యోగికి హుకుం జారీ చేయడం వివాదాస్పదమైంది. జడ్జి జారీ చేసిన నోటీసులకు సంబంధించిన కాపీ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం కోర్టులో డి.సెల్వమ్ జడ్జిగా పనిచేస్తున్నారు. జడ్జి ఇంటిలో పనిచేసేందుకు 47 ఏళ్ల వాసంతి అనే దళిత మహిళా ఉద్యోగిని ప్రభుత్వం నియమించింది. విధి నిర్వహణలో భాగంగా వాసంతి అన్ని పనులు చక్కగా చేస్తుంది.

అయితే జడ్జి భార్య లోదుస్తులు ఉతకడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదు. జడ్జి భార్య లోదుస్తులను చూడగానే ఆమె వాటిని అల్లంత దూరాన పారేస్తోంది. ఈ విషయాన్ని గమనించిన జడ్జి, ఆయన భార్య వాసంతిని నిలదీస్తే, భవిష్యత్తులో ఇక ఆ తప్పు మళ్లీ చేయనని చెప్పింది.
దీంతో జడ్జి ఆమెను వదిలేశారు. అయితే ఆ తర్వాత కూడా వాసంతి తన భార్య లోదుస్తులు ఉతకడానికి నిరాకరించడంతో ఈసారి కోపగించుకున్న జడ్జి ఈసారి అమెకు ఏకంగా నోటీసులు జారీ చేశారు. ‘‘లోదుస్తులు సరిగ్గా ఉతకడం లేదు. నీపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలి'' అంటూ ఫిబ్రవరి 1న జారీ చేసిన నోటీసుల్లో జడ్జి వాసంతిని కోరారు.
ఈ నోటీసులు వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో గురువారం ‘ద హిందూ' పత్రికతో మాట్లాడిన వాసంతి ఇంటి పనులు చక్కగా చేస్తున్నా, కేవలం బట్టలు ఉతకడం లేదంటూ నోటీసులు జారీ చేశారంటూ ఆమె వాపోయింది. వాసంతికి స్కూలుకు వెళ్లే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
సత్యమంగళం కోర్టు న్యాయమూర్తిగా గత మే నెలలోనే డి.సెల్వమ్ బదిలీపై వచ్చారు. జడ్జి ఇంటిలో పనుల నిమిత్తం వాసంతితో పాటు మరో ఉద్యోగిని తమిళనాడు ప్రభుత్వం నియమించింది. రాత్రి 7 గంటల వరకు జడ్జి ఇంటిలో తాము పనిచేస్తున్నట్లుగా ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications