విషాదం: చెక్డ్యాంలో ఈతకు వెళ్లి ఏడుగురు అమ్మాయిలు మృతి
చెన్నై: తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. కడలూరు సమీపంలోని చెక్ డ్యామ్ వద్ద ఈతకు వెళ్లిన ఏడుగురు బాలికలు మరనించారు. వీరంతా 18 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సున్నవారే.
ఇరుగుపొరుగువారు, స్నేహితులు అందరూ కలిసి జూన్ 5వ తేదీ ఆదివారం మధ్యాహ్నం స్నానం చేసేందుకు గేదిలం నదికి అడ్డంగా ఉన్న చెక్డ్యామ్ వద్ద నీటిలోకి వెళ్లారు. నీటిలోకి దిగిన అనంతరం ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్యామ్ లోతైన చివరలో బలమైన నీటి ప్రవాహం కారణంగా బాలికలు కొట్టుకుపోయి, మునిగిపోయారు.మృతులను ఎ మోనిషా (16), ఎం నవనీత (18), కె ప్రియ (18), ఎస్ సంగవి (16), ఆర్ దివ్య దర్శిని (10), ఆమె సోదరి ఆర్ ప్రియదర్శిని (16), ఎం కుమ్ముధ (18)గా గుర్తించారు. వీరంతా తమిళనాడులోని కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని కూచిపాళ్యం గ్రామానికి చెందినవారు.
కడలూరులోని ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాలికలను రక్షించేందుకు ప్రయత్నించారని, అయితే సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. అనంతరం వారి మృతదేహాలను వెలికితీసి, పోస్ట్మార్టం నిమిత్తం కడలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్సెల్వం బాలికల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నీటి వనరులు, ప్రమాదకరమైన ప్రదేశాలలో స్నానాలు చేయడం ద్వారా తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని స్థానిక ప్రజలను కోరారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఏడుగురు బాలికల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి నుంచి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
కాగా, కడలూరు జిల్లాలోని నెల్లికుప్పం సమీపంలో ఉన్న కూచిపాళయం గ్రామం సమీపంలో ప్రవహించే గెడ్డిలం నదిపై ఈ ఆనకట్ట నిర్మించబడింది. డ్యామ్లో నీరు నిలిచిపోవడంతో ఆదివారం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో చాలా మంది నదిలో స్నానాలు చేసేందుకు డ్యామ్ను సందర్శించారు.