ముగ్గులు వేయడమే ఆ మహిళలు చేసిన పాపం: కటకటాల వెనక్కి: ఆ ముగ్గుల్లోనే మర్మం..!
చెన్నై: నడిరోడ్డు మీద ముగ్గులు వేయడమే ఆ మహిళలు చేసిన పాపం. ఆ కారణంతోనే ఏడుమంది మహిళలను కటకటాల వెనక్కి తోశారు పోలీసులు. ముగ్గులు రోడ్డు మీదే కదా వేసేది..ఆ మాత్రానికే అరెస్టు చేస్తారా? అనే అనుమానం రావచ్చు. ఆ ముగ్గుల్లోనే అసలు మర్మం దాగుంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు, జాతీయ పౌర గణన కార్యక్రమాలకు వ్యతిరేకంగా ముగ్గులు అవి. సే నో టు సీఏఏ, సే నో టు ఎన్పీఆర్, ఎన్ఆర్సీ..అనే పదాలను జోడిస్తూ.. వేసిన ముగ్గులు.

బీసెంట్ నగర్ నిండా..
ఆ ఒక్క కారణంతోనే ఏడుమంది మహిళలను అరెస్టు చేశారు పోలీసులు. ఆ తరువాత వారి తరఫు న్యాయవాది స్టేషన్ కు వచ్చి, బెయిల్ ఇప్పించారు. చెన్నైలోని బీసెంట్ నగర్ లో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఘటన ఇది. అరెస్టయిన వారిలో గాయత్రి, మదన్, ఆర్తి, కల్యాణి, ప్రగతి ఉన్నారు. మరో ఇద్దరి వివరాలు తెలియ రావాల్సి ఉంది.

వ్యతిరేకిస్తోన్న డీఎంకే..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు, జాతీయ పౌర గణన కార్యక్రమాలపై దాదాపు అన్ని రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చెలరేగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూడింటినీ తమిళనాడులో అమలు చేయడానికి ప్రతిపక్ష డీఎంకే వ్యతిరేకిస్తోంది. ప్రత్యేకించి- పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినప్పటి నుంచీ డీఎంకే దశలవారీగా తన ఆందోళనను కొనసాగిస్తోంది.

సే నో టు సీఏఏ..
ఇందులో భాగంగా- ఈ ఉదయం డీఎంకే కు చెందిన మహిళా విభాగం కార్యకర్తలు రోడ్డలపై ముగ్గులు వేయడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. `సే నో టు సీఏఏ, సే నో టు ఎన్ఆర్సీ, ఎన్పీఆర్..` ముగ్గులు వేశారు. బీసెంట్ నగర్ నిండా అలాంటి ముగ్గులే కనిపించాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బీసెంట్ నగర్ కు చేరుకున్నారు. ముగ్గులు వేస్తోన్న ఏడుమంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా..
గాయత్రి, మదన్, ఆర్తి, కల్యాణి, ప్రగతి సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వ్యానులో వారిని జే 5 శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వారిని విడుదల చేశారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోంటే పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఆందోళన చర్యలకు తాము పాల్పడట్లేదని, ముగ్గుల ద్వారా నిరసన తెలియజేసినప్పటికీ.. అరెస్టు చేయడం పోలీసుల దౌర్జన్యానికి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications