కరోనా చెలరేగుతున్నా..వెనక్కి తగ్గని సర్కార్: బ్లాక్ మార్కెట్: 7 నుంచి అక్కడ మద్యం దుకాణాలు ఓపెన్
చెన్నై: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదైన తమిళనాడులో ఈ నెల 7వ తేదీ నుంచి మద్యం దుకాణాలు తెరచుకోబోతున్నాయి. గ్రీన్జోన్ ప్రాంతాలు, నాన్ కంటైన్మెంట్ క్లస్టర్లలో మద్యం అమ్మకాలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒకవంక పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలను పునరుద్ధరించడం వల్ల పరిస్థితులు అదుపు తప్పుతాయనే ఆందోళనలు వ్యక్తమౌతున్నప్పటికీ.. ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆదాయ వనరులను మెరుగుపర్చుకోవడంలో భాగంగా మద్యం దుకాణాలను తెరవాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది.
లిక్కర కిక్ ఎఫెక్ట్: తొలిరోజే విషాదం: తల్లీ కుమార్తె ఆత్మహత్య.. కుటుంబం ఛిన్నాభిన్నం
ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు..
తమిళనాడులో ప్రభుత్వమే మద్యం విక్రయాలను చేపట్టిన విషయం తెలిసిందే. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో అక్కడ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. దీనికోసం మార్కెటింగ్ శాఖలో ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. టాస్మాక్ ఆధీనంలో అక్కడ మద్యం దుకాణాలు పని చేస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా టాస్మాక్ దుకాణాలన్నింటికీ అనుమతి ఇవ్వట్లేదని, తొలిదశలో పరిమితంగా వాటిని తెరుస్తామని ప్రభుత్వం వెల్లడించింది. తొలిదశలో రిటైల్ అమ్మకాలను మాత్రమే ఆరంభిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు టాస్మాక్ అధికారులు తెలిపారు.
ఏపీ, కర్ణాటకల నుంచి బ్లాక్ మార్కెట్కు
పొరుగునే కర్ణాటక, ఏపీల్లో మద్యం దుకాణాలు తెరచుకోవడంతో పెద్దఎత్తున తమిళనాడు సరిహద్దు గ్రామాల ప్రజలు మద్యాన్ని కొనుగోలు చేయడానికి ఈ రెండు రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్నా, సరిహద్దుల్లో పోలీసులు పహారా కాస్తున్నా.. లెక్క చేయట్లేదు. పోలీసుల కన్నుగప్పి మరీ సరిహద్దులను దాటుకుంటున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ తాకిడి తీవ్రంగా ఉంటోంది. వందలాది మంది తమిళనాడు సరిహద్దు గ్రామాల ప్రజలు ఏపీలోకి వచ్చి మరీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అవి కాస్తా.. బ్లాక్ మార్కెట్కు తరలుతున్నాయనే అభిప్రాయం తమిళనాడు అధికారుల్లో వ్యక్తమౌతోంది.
మద్యం అమ్మకాలను పునరుద్ధరించడానికే మొగ్గు..
ఈ పరిస్థితులను నివారించడానికి తమ రాష్ట్రంలో కూడా మద్యం అమ్మకాలను పునరుద్ధరించడానికి పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఏపీ, కర్ణాటకల్లో మద్యాన్ని విక్రయిస్తుండటం వల్ల బ్లాక్ మార్కెటింగ్ ప్రభావం చూపుతుందని, అదేదో ఆంక్షలు, పరిమితులతో కూడిన మద్యం అమ్మకాలను తాము కూడా అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల కొద్దో, గొప్పో ఆదాయం కూడా అందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని టాస్మాక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్రం హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Recommended Video