పళనిస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేయండి: గవర్నర్కు పోటెత్తుతున్న మెయిల్స్
అన్నాడీఎంకె అంతర్గత పోరుతో తామంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యామని, పళనిస్వామి సీఎం పీఠంపై కూర్చోవడం తమకే మాత్రం ఇష్టం లేదని మెయిల్స్ ద్వారా వారు అభిప్రాయపడుతున్నారు.
చెన్నై: సీఎంగా పళనిస్వామి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా.. అక్కడి ప్రజల నుంచి మాత్రం అభ్యంతరాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. శశికళ-పన్నీర్ వార్ లో ఎక్కువ మంది ప్రజలు పన్నీర్ సెల్వం వైపే మద్దతుగా నిలిచినా.. ఎమ్మెల్యేలంతా శశికళ గుప్పిట్లోనే ఉండిపోవడంతో పన్నీర్ సెల్వంకు భంగపాటు తప్పలేదు.
ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేస్తూ వేలాదిమంది జనం గవర్నర్ విద్యాసాగర్ రావుకు మెయిల్స్ పంపిస్తున్నట్లుగా సమాచారం. అన్నాడీఎంకె అంతర్గత పోరుతో తామంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యామని, పళనిస్వామి సీఎం పీఠంపై కూర్చోవడం తమకే మాత్రం ఇష్టం లేదని మెయిల్స్ ద్వారా వారు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు, పళనిస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేస్తుండటం గమనార్హం. మరోవైపు సామాజిక మాధ్యమాల్లోను పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జోరుగా జరుగుతోంది.
బలపరీక్షకు ముందు కార్యకర్తలే ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకురావాలన్న పన్నీర్ సెల్వం వ్యాఖ్యలను అనుసరిస్తూ కొంతమంది ఈ ప్రచారం చేస్తుండగా.. మరికొంతమంది స్వచ్చందంగానే పళనిస్వామి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దుష్ప్రచారం పన్నీర్ పన్నిన కుట్ర అని అన్నాడీఎంకె వర్గాలు ఆరోపిస్తున్నాయి. చూడాలి మరి.. అన్నాడీఎంకె రాజకీయాల్లో పన్నీర్-పళని మధ్య వైరం మున్ముందు ఇంకెలా ఉండబోతుందో!