ప్రశాంత్ కిషోర్ తో క్రేజీ హీరో భేటీ - రాజకీయంగా సంచలనం : సీఎం తో పొలిటికల్ ఫైట్..!!
రాజకీయంగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్లటానికి పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన తమిళనాడు..పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా మద్దతిచ్చిన రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇక, ఇప్పుడు ఆయన పూర్తిగా జాతీయ రాజకీయాల పైన ఫోకస్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖ తమిళ హీరో విజయ్ హైదరాబాద్ కేంద్రంగా ప్రశాంత్ కిషోర్ తో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
పీకేతో భేటీతో విజయ్ సంకేతాలు
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాజకీయంగా క్రియాశీలకంగా మారేందుకు విజయ్ నిర్ణయించారా లేక అసలు తమిళనాడు భవిష్యత్ రాజకీయాల పైన ఆరా తీసారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల సమయానికి పార్టీని స్థాపించాలని 'విజయ్ మక్కల్ ఇయక్కం' నిర్వాహకులు విజయ్ పైన ఒత్తిడి పెంచుతున్నారు. ఒక విధంగా విజయ్ సైతం రాజకీయంగా ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ తండ్రి కొద్ది కాలం క్రితం ' ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం' పేరుతో ఒక పార్టీ పేరును రిజిస్టర్ చేసారు. ఆ తరువాత కుమారుడి ఒత్తిడితో ఉప సంహరించుకున్నారు. తమిళనాడులో ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల విజయ్ మక్కల్ ఇయక్కంకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు.
తమిళనాట రాజకీయాల్లో నెట్టుకొస్తారా
వారందరినీ విజయ్ ఇంటికి పిలిపించుకుని ఫొటో దిగారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయంగా ముందుకెళ్లే ఆలోచనలకు మరింత బలం చేకూరింది. తాజాగా.. విజయ్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశం కావటంతో కొత్త చర్చకు కారణమైంది. అయితే, విజయ్ మిత్రులు మాత్రం తమిళనాడు రాజకీయాలను విశ్లేషిస్తున్నారు. అక్కడ డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అన్నా డీఎంకే బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నా.. ఆ పార్టీ భవిష్యత్ పైన సొంత పార్టీ నేతల్లోనే నమ్మకం కనిపించటం లేదనేది వారి విశ్లేషణ. దీంతో..విజయ్ రాజకీయంగా అడుగులు ముందుకేస్తే..అన్నా డీఏంకే నేతలు విజయ్ వైపు నడిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అన్నాడీఎంకే నేతలపై గురి పెట్టారంటూ
రజనీకాంత్ సైతం పార్టీ కోసం మందుకొచ్చి..ఆ తరువాత నిర్ణయం మార్చుకోవటంతో అభిమానులు చాలా మంది డీఎంకేలో చేరారు. మరి కొంత మంది ఎటు చేరకుండా జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. దీంతో..2026 ఎన్నికల నాటికి రాజకీయంగా పార్టీ ఏర్పాటు.. కలిసొచ్చే పార్టీలతో కలిసి పొత్తులు..కూటమి వ్యూహాలతో అడుగులు వేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో..తమిళనాడు రాజకీయాల పైన ప్రశాంత్ కిశోర్ తో విజయ్ భేటీలు మరి కొన్ని సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాతనే విజయ్ తన రాజకీయ పార్టీ ఏర్పాటు.. భవిష్యత్ కార్యచరణ పైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.