'అసెంబ్లీకే కళంకం': జయ సమాధిపై బడ్జెట్ సూట్కేసు, ఇదేం తీరంటూ విమర్శలు!
ఇలాంటి చర్య ద్వారా అసెంబ్లీకే కళంకం తెచ్చారని, మంత్రి జయకుమార్ పై చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం నేతలు కూడా డిమాండ్ చేశారు.
చెన్నై: సందర్బం దొరికిన ప్రతీసారి అమ్మపై తమకున్న అభిమానం చాటుకునేందుకు అన్నాడీఎంకె నేతలు ప్రయత్నిస్తుంటారు. ఆమధ్య జయలలిత జైల్లో ఉన్న సమయంలోను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోను.. ఆమె ఫోటో పెట్టుకుని మరీ అప్పటి సీఎం పన్నీర్ సెల్వం ప్రభుత్వ సమావేశాలు నిర్వహించారు.
అమ్మ మరణంతో ఏర్పడిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం ప్రస్తుతం తమిళనాడులో కొలువుదీరిన సంగతి తెలిసిందే. పన్నీర్ సెల్వంతో వైరం కారణంగా అమ్మకు తామే అసలైన వారసులమని చాటుకునేందుకు ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
తాజాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలోను ఆర్థికమంత్రి డి.జయకుమార్ అమ్మపై అభిమానం చాటుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సీఎం పళనిస్వామితో కలిసి మెరీనా బీచ్ కు వెళ్లి.. జయలలిత సమాధిపై బడ్జెట్ సూట్ కేసు పెట్టి అంజలి ఘటించారు. దీంతో మరో కొత్త సాంప్రదాయానికి తెరదీసినట్లైంది. అనంతరం అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు.
అయితే ఆర్థిక మంత్రి వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. జయలలిత సమాధిపై బడ్జెట్ సూట్ కేసు ఉంచడం రాజ్యాంగ విరద్దమని, ఆర్థిక మంత్రిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డీఎంకె నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. ఇలాంటి చర్య ద్వారా అసెంబ్లీకే కళంకం తెచ్చారని, మంత్రి జయకుమార్ పై చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం నేతలు కూడా డిమాండ్ చేశారు.
కాగా, రూ. 1,75,293 కోట్లతో ఈ ఉదయం ఆర్థికమంత్రి డి.జయకుమార్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 15,930 కోట్లు లోటు బడ్జెట్ గా చూపించారు.