క్యాంపుపై దాడికి బయలుదేరిన డీజీపీ: ఎమ్మెల్యేలను తరలించే ప్లాన్లో శశికళ
ప్రత్యేక పోలీస్ బృందంతో కలిసి క్యాంపుపై దాడులు నిర్వహించడానికి ఆయన కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు.
చెన్నై: శశికళ తెరదీసిన క్యాంపు రాజకీయాల నుంచి ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చేందుకు స్వయంగా రాష్ట్ర డీజీపీ టీకే రామచంద్రన్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రత్యేక పోలీస్ బృందంతో కలిసి క్యాంపుపై దాడులు నిర్వహించడానికి ఆయన కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు.
చెన్నైకి 70కి.మీ దూరంలో కాంచీపురం జిల్లాలోని మహాబలిపురం సమీపంలో గల ఓ సముద్ర దీవిలో ఎమ్మెల్యేలను దాచిపెట్టారని డీజీపీ భావిస్తున్నారు. ఇక్కడి నాలుగు రిసార్టుల్లో 30మంది ఎమ్మెల్యేల చొప్పున నాలుగు ఎమ్మెల్యేల బృందాలను దాచిపెట్టినట్టు తెలుస్తోంది.

అయితే పోలీసులు దాడులు చేయడానికి వస్తున్నారన్న విషయం చెవిన పడగానే.. వారిని అక్కడినుంచి తరలించేందుకు ఏర్పాట్లు షురూ అయ్యాయన్న వాదన వినిపిస్తోంది. దీవి నుంచి పడవల ద్వారా ఎమ్మెల్యేలందరిని సముద్ర తీరానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి వేర్వేరు బృందాలుగా వారిని వేర్వేరు రహస్య ప్రాంతాలకు తరలించాలని శశికళ వర్గం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
డీజీపీ బృందం ఎమ్మెల్యేల క్యాంపుపై దాడి చేస్తే.. అక్కడి ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారు? తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications