టార్గెట్ చైనా-వివో సహా పలు విదేశీ మొబైల్ కంపెనీలపై ఈడీ దాడులు-మనీలాండరింగ్ కేసులో
భారత్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్న పలు చైనా మొబైల్ కంపెనీలను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలకు దిగుతోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ మేరకు చైనా సంస్ధల్ని టార్గెట్ చేస్తూఇవాళ దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులకు దిగుతున్నారు. దీంతో ఆయా సంస్ధలు బెంబేలెత్తుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి.
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వివోతో పాటు మరికొన్ని ఇతర సంస్థలపై మనీలాండరింగ్ దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా 44 ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ల కింద సోదాలు జరుగుతున్నాయి. వివో, అనుబంధ కంపెనీలకు సంబంధించిన 44 చోట్ల ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోందని వారు తెలిపారు.
ఇప్పటికే చైనా మొబైల్ తయారీ సంస్ధలు భారత్ లో వ్యాపారాల పేరుతో ఎంటరై మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆధారాల వేట కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఏకకాలంలో దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇందులో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.
వీటి ఆధారంగా వివో సహా పలు సంస్ధలకు నోటీసులు ఇచ్చే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. తగిన ఆధారాలు లేకుండా విదేశీ సంస్ధల్ని టార్గెట్ చేస్తే అంతర్జాతీయంగా అభాసుపాలయ్యే అవకాశాలు ఉండటంతో ఈడీ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.