టార్గెట్.. తమిళనాడు! పట్టుకోసం బీజేపీ గట్టి ప్రయత్నం, రజినీకాంత్ తురుపుముక్కే, అంత సులభమా?
ఉత్తరాదిన కొనసాగుతున్న కమలవికాసాన్ని దక్షిణాదికీ విస్తరించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్న బీజేపీ అధిష్టానం.. తెలుగు రాష్ట్రాలతోపాటుగా తమిళనాడుపైనా ప్రత్యేక దృష్టిపెట్టింది.
న్యూఢిల్లీ: ఉత్తరాదిన కొనసాగుతున్న కమలవికాసాన్ని దక్షిణాదికీ విస్తరించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్న బీజేపీ అధిష్టానం.. తెలుగు రాష్ట్రాలతోపాటుగా తమిళనాడుపైనా ప్రత్యేక దృష్టిపెట్టింది.
అందుకే తమిళనాడులో జరుగుతున్న ప్రతి రాజకీయ కదలికలోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంటోంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకం ప్రారంభోత్సవం కోసం రామేశ్వరం వెళ్లిన ప్రధాని మోడీ.. తన ప్రసంగంలో జయలలితను గుర్తుచేసుకోవటం, అమ్మలేని లోటు స్పష్టంగా కనబడుతోందని చెప్పటం.. ఇవన్నీ తమిళనాడుపై బీజేపీకి ఉన్న ఆసక్తిని చెప్పకనే చెప్పాయి.

మోడీ మాటలే సంకేతం...
జయలలిత కన్నుమూశాక ఎనిమిది నెలల్లో మూడుసార్లు తమిళనాడు వచ్చిన మోడీ.. ఎప్పుడూ అమ్మ గురించి ఇంతలా ప్రస్తావించలేదు. కానీ, ఈసారి జయ, తమిళ ప్రజలపై ఇంతప్రేమను గుప్పించటం, తమిళనాట రాజకీయ గందరగోళాన్ని ప్రస్తావించటం కూడా మోడీ భవిష్యత్ ప్రణాళికలకు సంకేతాలే.
Recommended Video


దక్షిణాదిన పార్టీ విస్తరణ కోసం...
బీహార్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన మహాకూటమిని విజయవంతంగా విచ్ఛిన్నం చేసి జేడీయూని తనవైపు తిప్పుకున్న కాషాయ దళం.. దక్షిణాదిన ద్రవిడ రాష్ట్రం తమిళనాడులో పార్టీ విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది.

ఆధిపత్యపోరు, చీలికలు.. ఇవే బీజేపీ ఆయుధాలు
నిజానికి తమిళనాట రాజకీయాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జయ మరణం తర్వాత ఏఐఏడీఎంకేలో ఆధిపత్యపోరు, చీలికలు విపక్షాలు తమ పనిని చక్కబెట్టుకోవటంలో అపారమైన అవకాశాలు కల్పిస్తున్నాయి. విపక్ష డీఎంకే వేగంగా ఓటుబ్యాంకును పెంచుకుంటోంది.

రాజకీయ శూన్యత.. గొప్ప అవకాశం
అన్నాడీఎంకేలో రెండు కూటముల మధ్య వివాదంతో ప్రభుత్వం పని తీరు కూడా మందగించింది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు, అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న నిస్తేజం వల్ల రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తనకనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

మోడీ మంత్ర జపం...
తమిళనాడులో కేవలం 2.5 శాతం ఓటు బ్యాంకున్న బీజేపీ తన పరిధిని మరింత విస్తృత పరుచుకోవాలని భావిస్తోంది. కేంద్ర పథకాల వల్ల దేశంలో యువత మోడీ వైపు ఆకర్షితులవుతున్నారని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. మార్పుకు సమయం ఆసన్నమైందని ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే కోయంబత్తూరులో జరిగిన ఆరెస్సెస్ అఖిలభారతీయ సమావేశాల్లోనూ తమిళనాట పార్టీ విస్తరణపై చర్చ జరిగినట్లు సమాచారం.

అమిత్ షా పర్యటనతో బీజం...
జూన్లో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా తమిళనాడులో రెండ్రోజులు పర్యటించి పార్టీ విస్తరణకు బీజం వేశారు. కాగా, ఎన్డీయేలో అన్నా డీఎంకే చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. పార్టీలోని రెండు వర్గాలు ఈ అంశంపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సీఎం పళనిస్వామితో ఓ సీనియర్ కేంద్ర మంత్రి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

రజినీకాంత్పైనే ఆశలు...
బీజేపీ జాతీయ నాయకత్వం, ఆరెస్సెస్ విస్తృతంగా ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపే సమర్థుడైన నేత లేకపోవటం బీజేపీకి పెద్ద అవరోధంగా మారింది. తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ ఇమేజీని పార్టీ విస్తరణకు వాడుకోవాలనుకుంటోంది.రజినీ సొంతంగా పార్టీ పెట్టినా బీజేపీకి అనుబంధంగానే ఆ పార్టీ ఉంటుందని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, రజినీ సన్నిహితుడు గురుమూర్తి చెప్పటం గమనార్హం.

అంత వీజీ కాదు...
ద్రవిడ పార్టీలు పాతుకుపోయిన తమిళనాడులో చొచ్చుకుపోవటం బీజేపీకి అంత సులువేం కాదు. దీనికితోడు హిందీ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నచోట.. ఉత్తరాది పార్టీగా ముద్ర ఉన్న బీజేపీకి అనుకూల వాతావరణం ఉండదు. అందుకే బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అన్నాడీఎంకేలో చీలికను అడ్డంపెట్టుకుని రాష్ట్ర వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటోంది. వీలున్నపుడల్లా తన పార్టీ విస్తృతిని పెంచుకోవాలని యత్నిస్తోంది.












Click it and Unblock the Notifications